అసంతృప్తి: జగన్కు కొండా సురేఖ దూరమయ్యారా?
కొండా సురేఖ దంపతులు పార్టీలో మునుపటిలా చురుగ్గా వ్యవహరించడం లేదు. అప్పటి మాదిరిగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను అంటి పెట్టుకుని సురేఖ ఉండడం లేదని అంటున్నారు. వైయస్ జగన్ సోదరి షర్మిల పాదయాత్రలో కూడా మొక్కుబడిగానే ఆమె పాల్గొన్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి.
తెలంగాణలో కొండా సురేఖ ముఖ్యమైన నాయకురాలు అవుతారనే అంచనాలు తుడిచిపెట్టుకుని పోయినట్లు భావిస్తున్నారు. తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన అఖిల పక్ష సమావేశానికి పార్టీ ప్రతినిధిగా బాజిరెడ్డి గోవర్దన్ వెళ్తారనే మాట వినిపించింది గానీ కొండా సురేఖ పేరు ప్రస్తావనకు కూడా రాలేదు. తీరా, కెకె మహేందర్ రెడ్డిని తెలంగాణ ప్రతినిధిగా అఖిల పక్ష సమావేశానికి పంపించారు. దీనిపై కూడా ఆమె అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.
కాగా, ఇటీవల తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు కుటుంబంపై చేసిన వ్యాఖ్యలకు జగన్ సురేఖపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కెసిఆర్, ఆయన కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకుంటే తెలంగాణ వస్తుందని ఆమె వ్యాఖ్యానించారు. ఇది తీవ్ర దుమారానికి కారణమైంది. తెరాస నాయకులకు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుతూ ఆమె వేడి పుట్టించారు. ఈ వ్యవహారంలో తనకు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నుంచి మద్దతు లభించకపోవడంపై కూడా సురేఖ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సురేఖ అనవసరమైన వివాదాన్ని ముందుకు తెచ్చారని పార్టీ నాయకులు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.
పైగా, తన సమ్మతి లేకుండా, తనను సంప్రదించకుండా వరంగల్ జిల్లాకు చెందిన వారిని పార్టీలో చేర్చుకోవడంపై కూడా ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు చెబుతున్నారు. తెలుగుదేశం తెలంగాణ ఫోరం కన్వీనర్ ప్రదీప్ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. ఎర్రబెల్లి దయాకర్ రావుతో కొండా దంపతులకు బద్ధ వైరం ఉంది. దీంతో ప్రదీప్ రావును చేర్చుకోవాలనే ఆలోచనపై కూడా సురేఖ అసంతృప్తితో ఉన్నట్లు చెబుతున్నారు.