యువతికి అధికార అంత్యక్రియలు: సోనియా కంట నీరు
న్యూఢిల్లీ: బస్సులో గ్యాంగ్ రేప్కు గురై సింగపూర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన అమ్మాయికి ఆదివారం ఉదయం ఢిల్లీలో అంత్యక్రియలు పూర్తయ్యాయి. మృతదేహాన్ని సింగపూర్ నుండి తరలించిన గంటల్లోనే అంత్యక్రియలు పూర్తి చేశారు. అధికార లాంఛనాలతో ఆమెకు అంత్యక్రియలు జరిపారు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఆర్పిఎన్ సింగ్ ఇందులో పాల్గొన్నారు. ఢిల్లీ విమానాశ్రయంలో బాధితురాలి మృతదేహానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్, యుపిఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాళులు అర్పించారు.
కాగా గ్యాంగ్ రేప్ బాధితురాలి మరణ వార్త విని కాంగ్రెస్ అధినేత్రి సోనియా చలించిపోయారు. ప్రియ సోదరిని కోల్పోయాం అంటూ ఆమె కన్నీళ్లు పెట్టుకున్నారు. ధైర్య, సాహసాలతో కూడిన ఆమె పోరాటాన్ని వృధాగా పోనివ్వనని, తగిన న్యాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. యువతి మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతూ సోనియా శనివారం మాట్లాడారు. మహిళలపై అత్యాచారాలకు, లైంగిక దాడులకు మగవాళ్లను పురికొల్పుతున్న సిగ్గులేని సామాజిక ధోరణులను మారుద్దామంటూ ఆవేదనతో, ఆక్రోశంతో పిలుపునిచ్చారు.
అసాధారణమైన పరిస్థితులకు ఎదురొడ్డి సాహసోపేతంగా రెండు వారాలు పోరాడిన యువతి మృతి చెందటంతో తన హృదయం మానసిక క్షోభతో నిండిపోయిందని తెలిపారు. మాటలకందని కిరాతక దాడి ఆమె ప్రాణాలను బలితీసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ఎంతో ప్రియమైన సోదరిని పోగొట్టుకున్నందుకు భారతీయులంతా నేడు దుఃఖంలో మునిగిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తు ఉన్న కూతురిని పోగొట్టుకున్న ఆమె తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. వాళ్ల బాధను దేశం మొత్తం పంచుకుంటోందన్నారు.
ఆమె పోరాటం వృధా కానీమన్నారు. అయితే, ఆమె అపరిమితమైన ధైర్యానికి, తలవంచని స్ఫూర్తికి చావులేదన్నారు. వాటిని ఎవరూ మర్చిపోలేరని చెప్పారు. మహిళల రక్షణ కోసం మన చట్టాలు, మన యంత్రాంగంతో పోరాడాలని తీర్మానించుకున్న అందరికీ ఆమె ధైర్యం, స్ఫూర్తి బలాన్ని ఇస్తాయన్నారు. ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డ వారికి త్వరితగతిన తగిన శిక్ష పడేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ఆమెకు మద్దతుగా బహిరంగంగా కోపాన్ని, ఆవేదనను వ్యక్తం చేసిన వారందరి గళాలను తాము విన్నామని చెప్పారు. బాధితురాలి విషయంలో అందరూ ఎలాంటి స్థితిని అనుభవిస్తున్నారో ఒక మహిళగా, తల్లిగా తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా పోరాడాలన్న సామూహిక తీర్మానాన్ని తాను కూడా బలపరుస్తానని.. ప్రజలందరూ శాంతియుతంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.