కెసిఆర్కు చెక్: జగన్, చంద్రబాబులతో సిపిఐ దోస్టీ?

గురువారం జరిగిన సిపిఐ కార్యవర్గ సమావేశంలో తెలంగాణ అంశం వరకు బిజెపితో జత కట్టాలనే కీలకమైన నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అన్ని జిల్లా కేంద్రాల్లో ఉద్యమ కార్యాచరణ చేపట్టాలని సిపిఐ భావిస్తోంది. పైగా, కెసిఆర్ వాదనలను పక్కన పెట్టి తెలంగాణపై తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలను కూడా కలుపుకుని వెళ్లాలని సిపిఐ నిర్ణయించుకున్నట్లు సమాచారం.
తెలంగాణపై కాంగ్రెసు మీద ఒత్తిడి పెంచేందుకు వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపిలను సమాయత్తం చేయాలనే ఆలోచనలో సిపిఐ ఉంది. కలిసి వస్తే తెరాసను కూడా తన ఉద్యమ కార్యాచరణలోకి తేవాలని అనుకుంటున్నట్లు సమాచారం. వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం, బిజెపి, తెరాసలతో ఓ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణ అంశాన్ని నెల రోజుల్లో తేలుస్తామని కేంద్ర హోం మంత్రి సుశీల్ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో ఈలోగా చేపట్టాల్సిన ఆందోళన కార్యక్రమాలపై, ఒక వేళ ఈలోగా కేంద్రం నిర్ణయం తీసుకోకపోతే ఆ తర్వాత చేపట్టాల్సిన ఉద్యమ కార్యాచరణపై కూడా ఓ ఆలోచన చేయాలని అనుకుంటోంది. తెలంగాణపై ఈలోగా ఇందిరా పార్కు వద్ద ఓ ధర్నా నిర్వహించి రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.
తెలుగుదేశం, వైయస్సార్ కాంగ్రెసు పార్టీలు సమైక్యవాదాన్ని వినిపించలేదు కాబట్టి తెలంగాణకు అనుకూలంగానే వ్యవహరించినట్లు భావించాలని సిపిఐ భావిస్తోంది. తెలంగాణ సెంటిమెంటును గౌరవిస్తున్నామని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ చెప్పింది. తెలుగుదేశం పార్టీ వైఖరిని తెలంగాణకు అనుకూలంగా ఉన్నట్లు అర్థం చేసుకోవాలని నారాయణ ఇంతకు ముందు అన్నారు. ఇదే సమయంలో విద్యుత్తు సమస్యపై వామపక్షాలతో కలిసి ఆందోళనలు చేపట్టాలని సిపిఐ అనుకుంటోంది.












Click it and Unblock the Notifications