అజ్ఞాతంలోనే ఎ-14 పరిటాల శ్రీరాం: కర్నాటకలో గాలింపు
కర్నాటకలో శ్రీరామ్ ఉన్నాడనే సమాచారం పోలీసులకు వచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆంధ్రప్రదేశ్లోనే కాకుండా అనంతపురం సరిహద్దులో ఉన్న కర్నాటకలోనూ పోలీసులు అతని కోసం వేట ప్రారంభించారు. ఈ కేసులో మొత్తం 15 మందిపై కేసు నమోదయింది. నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. పరిటాల శ్రీరామ్తో సహా మరో పదకొండు మంది కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
వీరి కోసం మూడు బృందాలు రంగంలో ఉన్నాయి. కాగా ఈ కేసుకు సంబంధించి పరిటాల శ్రీరామ్ను ఎఫ్ఐఆర్లో ఎ-14 నిందితుడిగా, నాగూర్ హుస్సేన్ను ఎ-15 నిందితుడిగా పేర్కొన్నారు. సుధాకర్ హత్యకు పది లక్షల సుపారీ చేతులు మారినట్లుగా కూడా ఎఫ్ఐఆర్లో పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. పరిటాల శ్రీరామ్ విదేశాలకు వెళతాడనే సమాచారం రావడంతో పోలీసులు అన్ని విమానాశ్రయాలను అప్రమత్తం చేశారు.
ముందస్తు బెయిల్
మరోవైపు పరిటాల శ్రీరామ్ కోసం ధర్మవరం కోర్టులో ముందస్తు బెయిల్ దాఖలు చేశారు. రేపు అనంతపురం జిల్లా కోర్టులో దీనిపై వాదనలు జరగనున్నాయి. ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్న కారణంగా బెయిల్ వచ్చే వరకు శ్రీరామ్ అజ్ఞాతంలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. నిన్న అతను ధర్మవరం కోర్టులో లొంగిపోతారనే పుకార్లు రావడంతో పోలీసులను బాగా మోహరించారు. కానీ అది జరగలేదు.