బిజెపి: ప్రజల్లోకి అక్బర్ హేట్ స్పీచ్, వారు మాట్లాడరేం?
'హిందుస్థాన్ను వెయ్యేళ్లు పాలించాం, దేశంలో 25 కోట్ల ముస్లింలు ఉన్నారు. ఎందుకు మౌనంగా ఉండిపోవాలి? పదిహేను నిమిషాలు పోలీసులను పక్కకు పెట్టండి. మా సత్తా చూపుతాం. కౌసల్య ఎక్కడెక్కడికి వెళ్లింది? రాముడికి ఎక్కడెక్కడ జన్మనిచ్చింది?' వంటి అక్బర్ వ్యాఖ్యలను కరపత్రాల్లో ఉటంకించారు.
కాగా హిందువుల మనోభావాలను కించపరుస్తూ దేశంలో మత ఘర్షణలు రేకెత్తించడానికి యత్నించిన అక్బరుద్దీన్కు సాంఘిక బహిష్కరణే సరైన శిక్షని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మహబూబ్నగర్ జిల్లా షాద్నగర్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. హిందువులనే కాకుండా గోమాతను, శ్రీరాముడిని సైతం అవహేళన చేసిన అక్బరుద్దీన్ చర్యను అన్ని మతాల వారు ఖండించారన్నారు.
ఆయన వ్యాఖ్యలు చూస్తుంటే అంతర్జాతీయ కుట్ర జరుగుతోందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయని అన్నారు. మత విద్వేషాలను రెచ్చగొడుతూ, అక్బరుద్దీన్ ఒక వర్గాన్ని కించపరిచారని, ఆయన వ్యాఖ్యలపైనా తీర్మానం చేయాలని ఆ పార్టీ అధికార ప్రతినిధి ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ డిమాండ్చేశారు. హిందువులను, హిందూ దేవతలను విమర్శించడం వల్ల ఆ మతస్తుల మనోభావాలు దెబ్బతిన్నాయన్నారు.
లౌకికవాదులమని చెప్పుకొనే వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మ, తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అక్బర్ వ్యాఖ్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు. అక్బర్ శాసనసభ్యత్వాన్ని ఆ పార్టీ గుర్తింపును రద్దు చేయాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.