జగన్వైపు ద్వారంపూడి: కాంగ్రెస్కు రిజైన్,ఎమ్మెల్యేకు నో
దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి సంక్షేమ పథకాలను ప్రస్తుత ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందన్నారు. ప్రజా సంక్షేమం కాంగ్రెసు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. తన రాజీనామా లేఖను ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడు, రవాణా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు పంపినట్లు చెప్పారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండానే కిరణ్ ప్రభుత్వాన్ని అవిశ్వాసం ద్వారా గద్దె దింపే ప్రయత్నాలు చేస్తానని వెల్లడించారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కొంగ జపాలు మాని కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని సవాల్ చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఎక్కడి నుండి పోటీ చేయమంటే అక్కడి నుండి చేస్తానన్నారు. ఆరోపణలపై సిబిఐ సహా ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని ప్రకటించారు. ద్వారంపూడి త్వరలో జగన్ పార్టీలో చేరనున్నారు.
కాగా కాంగ్రెసు పార్టీకి ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి దూరమవుతున్నట్లుగా కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. ఆయన ఆదివారంనాడే వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారనే వార్తలు వచ్చినప్పటికీ మరికొన్ని రోజులు ఆగి చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా మొదట పార్టీకి రాజీనామా చేశారు. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డికి వైయస్ రాజశేఖర రెడ్డి పట్టుబట్టి కాకినాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు గత ఎన్నికల్లో కాంగ్రెసు టికెట్ ఇప్పించారు.
ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తారని మొదటి నుంచీ అనుకుంటోందే. ఇందులో ఆశ్చర్యమేమీ లేదని కాంగ్రెసు వర్గాలు అంటున్నాయి. ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి వైయస్ జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు. వైయస్ రాజశేఖర రెడ్డి ద్వారా టికెట్లు పొంది, విజయం సాధించన శానససభ్యులు ఇంకా కొంత మంది ఉన్నారని, వారంతా వైయస్సార్ కాంగ్రెసులోకి వస్తారని అంటున్నారు.
కృష్ణా జిల్లాకు చెందిన మరో ఇద్దరు శాసనసభ్యులు కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరుతారని ప్రచారం సాగుతోంది. అంతేకాకుండా, ప్రకాశం జిల్లాలో కాంగ్రెసు పార్టీకి ఎదురు దెబ్బ తగిలే అవకాశాలు కనిపిస్తున్నాయి. జిల్లాకు చెందిన ఇద్దరు కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు వైయస్ జగన్ నాయకత్వంలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. అద్దంకి శానససభ్యుడు గొట్టిపాటి రవికుమార్తో పాటు దర్శి శాసనసభ్యుడు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డితో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులు మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.