బావ ఊళ్లో బావమరిది సంక్రాంతి సందడి: వేడుకగా...
హైదరాబాద్ ఖాళీ... బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు రద్దీ
సంక్రాంతి పండుగ కావడంతో హైదరాబాదు నుండి తమ సొంత ఊర్లకు ఇప్పటికే చాలామంది వెళ్లిపోయారు. ఇంకా ప్రయాణాలు సాగుతూనే ఉన్నాయి. పండుగ సందర్భంగా అందరూ ఊళ్లకు వెళ్లేందుకు ఇష్టపడతారు. దీంతో సికింద్రాబాదు, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లలో రద్దీ విపరీతంగా పెరిగింది. అలాగే ఇతర ప్రాంతాలకు వెళ్లే ఆర్టీసి బస్టాండులలోనూ రద్దీ తీవ్రంగా ఉంది. ప్రయాణ సౌకర్యాలు అనుకూలంగా లేకపోవడంతో ప్రయాణీకులు ఇక్కట్లు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోతున్నాయి. అందరూ ఊళ్లకు వెళ్లి పోవడంతో హైదరాబాద్ నగరం బోసి పోయినట్లుగా ఉంది.
బోగీ మంటలతో నిరసన
పలుచోట్ల బోగి మంటలతో ప్రభుత్వం పైన ప్రజలు నిరసన వ్యక్తం చేశారు. పెరిగిన ధరలు అన్నీ బోగి మంటల్లో కలిసి పోవాలని కోరుతూ పలువురు నిరసన వ్యక్తం చేశారు. హైదరాబాదులో ఏఐవైఎఫ్ ఆధ్వర్యమలో విద్యుత్ ఛార్జీలు, ఆర్టీసి ఛార్జీలు పెంపుదలతో పాటు నిత్యవాసల ధరల పెరుగుదలను నిరసిస్తూ దిష్టి బొమ్మను బోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. బోగి మంటల్లో ఒకటి రెండు చోట్ల చిన్న చిన్న ప్రమాదాలు జరిగాయి.
ఎడ్లు, కోళ్ల పందేలు
సీమాంధ్రలో పలు చోట్ల ఎడ్ల పందేలు, కోళ్ల పందేలు జరిగాయి. కొన్ని చోట్ల పందేలు వివాదానికి దారి తీశాయి. ఎడ్లు, కోళ్ల పందేలలో యువత కూడా పాల్గొని ఆనందాన్ని పొందారు. పతంగులు ఎగురవేస్తూ పిల్లలు, యువత ఉల్లాసంగా గడుపగా, ముగ్గులు వేసిన అమ్మాయిలు ఆకట్టుకున్నారు.
హీరో, తెలుగుదేశం పార్టీ నేత నందమూరి బాలకృష్ణల తన బావ నారా చంద్రబాబు నాయుడు స్వగ్రామం నారావారిపల్లెకు వెళ్లారు. ఆయన కుటుంబ సమేతంగా అక్కడకు వెళ్లి అక్కడ సంక్రాంతి పండుగ జరుపుకుంటున్నారు. బాలయ్యతో పాటు నారా లోకేష్, నారా బ్రాహ్మిణి, మోక్షజ్ఞ, వసుంధర, నందమూరి రామకృష్ణ తదితరులు నారావారిపల్లెలో వేడుకలలో పాల్గొన్నారు. బాలయ్య రావడంతో అభిమానులు పెద్ద ఎత్తున ఆయనను చూసేందుకు తరలి వచ్చారు. గ్రామంలోని పలువురికి నారా లోకేష్ తన మావయ్య బాలయ్యను పరిచయం చేశారు.
నటుడు మోహన్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతిలోని తన విద్యానికేతన్ పాఠశాల వద్ద సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఆయన కుమారులు విష్ణు, మనోజ్, తనయ లక్ష్మీ ప్రసన్నలు కూడా కుటుంబ సమేతంగా అక్కడకు తరలి వచ్చారు. బోగి మంటలు వేసి గ్రామస్తులతో సరదాగా గడిపారు.
ఖమ్మంలో చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ఖమ్మం జిల్లాలో సంక్రాంతి ఉత్సవాలను జరుపుకున్నారు. ఆయన సెయింట్ జోసెఫ్ పాఠశాలలో విద్యార్థులు వేసిన ముగ్గులను తిలకించారు.