వైయస్ జగన్ మళ్లీ తెరలేపారా, పండుగ తర్వాత క్యూ?
ప్రకాశం జిల్లాలో ఇప్పటికే ఇద్దరు జగన్ వైపు వెళతారనే ప్రచారం సాగుతోంది. అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవి కుమార్తో పాటు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి కూడా జగన్ పంచన చేరవచ్చునని అంటున్నారు. బూచేపల్లి జగన్ కోసం వైయస్సార్ కాంగ్రెసు పార్టీ సేకరిస్తున్న డైరీలో సంతకం చేశారు కూడా. కృష్ణా జిల్లా నుండి జోగి రమేష్, పేర్ని నానిలు జగన్ వైపు వెళ్లేందుకు ఆసక్తి కనబరుస్తున్నారని అంటున్నారు.
ఆదివారం జోగి రమేష్ చేసిన ప్రకటన అనుమానాలను రేకెత్తిస్తోంది. తాను ఎప్పుడూ దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి ఫోటోతోనే గెలిచానని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఆయన ఫోటోతోనే బరిలోకి దిగుతానని స్పష్టంగా చెప్పారు. అయితే జగన్ పార్టీలో చేరతారా అని ప్రశ్నిస్తే మాత్రం సమాధానం దాటవేశారు. దీంతో ఆయన జగన్ వైపుకు వెళ్లేందుకు పావులు కదుపుతున్నారనే ప్రచారం మరింత ఊపందుకుంది. ఆయనతో పాటు పేర్ని నానిది కూడా అదే దారి అంటున్నారు.
ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి కాంగ్రెసు పార్టీకి రాజీనామా చేసి జంప్ జిలానీ అంశాన్ని వేడెక్కించారని అంటున్నారు. ఆయన తర్వాత ఒక్కరొక్కరుగా సమయం చూసుకొని జగన్ దరి చేరనున్నారని అంటున్నారు. సంక్రాంతి పండుగ తర్వాత జగన్ పార్టీ వైపు మరికొన్ని వరుస జంపింగ్స్ అధికార పార్టీ నుండి ప్రారంభమవుతాయని అంటున్నారు. కేంద్రం తెలంగాణకు ఏమాత్రం అనుకూలంగా నిర్ణయం తీసుకున్నా ఇది కాస్త 28వ తేది తర్వాత మరికాస్త ఊపందుకుంటుందని అంటున్నారు.