మేం తలుచుకుంటే ఉండలేరు: జగన్ పార్టీకి హరీష్
విధ్వంసం సృష్టిస్తే నష్టపోయేది సీమాంధ్రవాళ్లేనని ఆయన అన్నారు. "మా వాళ్లు మీ దగ్గర లేరు, మీరే మా చేతుల్లో ఉన్నారు. రెచ్చగొడితే నష్టపోయేది మీరే" అని ఆయన అన్నారు. గుర్నాథ్ రెడ్డి వ్యాఖ్యలపై సమాధానం ఇవ్వాలని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైయస్ విజయమ్మను డిమాండ్ చేశారు. సీమాంధ్ర నేతల వ్యాఖ్యల వల్ల హైదరాబాదులో ఏమైనా జరిగితే అందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన అన్నారు.
తమ అక్రమ సంపాదనను కాపాడుకునేందుకు సీమాంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణను అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు. హైదరాబాదును వదులుకునే ప్రసక్తి లేదని ఆయన అన్నారు. సమానత్వం కోసమే తెలంగాణ పోరాటం చేస్తున్నామని ఆయన అన్నారు. పొట్ట కూటి కోసం వచ్చిన వాళ్లకు తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎత్తిన జెండా దించేది లేదని ఆయన అన్నారు. తెలంగాణ ఉద్యమానికి విరామం లేదని, విశ్రమించబోమని ఆయన మంగళవారం అన్నారు.
తెలంగాణను అడ్డుకునేందుకు కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు కలిసిపోయాయని హరీష్ రావు ఆరోపించారు. సీమాంధ్ర తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలపై ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పష్టత ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. తేడా వస్తే సీమాంధ్రకు చెందిన కాంగ్రెసు, వైయస్సార్ కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను బొంద పెడతామని ఆయన అన్నారు.
తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్ర మంత్రులు చేస్తున్న వ్యాఖ్యల వెనక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి హస్తం ఉందని ఆయన విమర్శించారు. సమైక్యాంధ్ర సదస్సుకు ముఖ్యమంత్రి ఎలా అనుమతిస్తారని ఆయన అడిగారు. కాంగ్రెసు అధిష్టానం నిర్ణయాన్ని ముఖ్యమంత్రి అంగీకరిస్తారా, సీమాంధ్ర మంత్రులను రెచ్చగొడుతారా తేల్చుకోవాలని ఆయన అన్నారు. ఉమ్మడి రాజధాని అంటే మంత్రి నాగేందర్కు అర్థం తెలుసా అని ఆయన అడిగారు. ఎట్టి పరిస్థితిలోనూ హైదరాబాదును వదులుకునే ప్రసక్తి లేదని ఆయన అన్నారు.