సంగారెడ్డితో హైదరాబాద్ రాష్ట్రం కావాలి: జగ్గారెడ్డి
రాష్ట్ర విభజన రాజకీయ ఎజెండా అని, తెలంగాణ తేలదని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుకు కూడా తెలుసునని ఆయన అన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని, లేదంటే మూడు రాష్ట్రాలుగా చేయాలని ఆయన అన్నారు. హైదరాబాదుకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రాంతాలను హైదరాబాదు రాష్ట్రంలో కలపాలని ఆయన అన్నారు. తెలంగాణ ఇస్తే అభివృద్ది కుంటుపడుతుందని, అందుకే తాను వ్యతిరేకిస్తున్నానని ఆయన చెప్పారు.
దానం నాగేందర్పై తెలంగాణ నగారా సమితి నాయకుడు నాగం జనార్దన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ వస్తుందనే సంకేతాలు ఉన్నాయని చెప్పిన నాగేందర్ ఇప్పుడు హైదరాబాదును ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని ఎందుకు అడుగుతున్నారని ఆయన ప్రశ్నించారు. తెలంగాణను అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేయవద్దని ఆయన సూచించారు. తెలంగాణను పక్కదారి పట్టించాలని చూస్తే తాము సహించబోమని ఆయన అన్నారు. దానం నాగేందర్ తెలంగాణ ఉద్యమ చరిత్రను తెలుసుకోవాలని ఆయన అన్నారు.
తాను ఆశావాదిని అని, తెలంగాణ వస్తుందనే విశ్వాసం తనకు ఉందని ప్రభుత్వ చీఫ్ విప్ గండ్ర వెంకటరమణా రెడ్డి అన్నారు. తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉండాలని ఆయన సూచించారు. తెలంగాణను ఎవరూ అడ్డుకోవద్దని ఆయన అన్నారు.