తెలంగాణ దిశగా అడుగు, అవమానాలు భరించాం: జానా
అందుకు సోనియాకు, పార్టీకి, కేంద్రానికి కృతజ్ఞతలు అని ఆయన అన్నారు. తెలంగాణ కోసమే తాము ఇన్నాళ్లు తెలంగాణ ప్రజల నుండి అవమానాలు ఎదురైనా భరిస్తూ వచ్చామన్నారు. తెలంగాణ ఒత్తిడి ప్రజల నుండి అధిగమిస్తూనే కాంగ్రెసు పార్టీ కుటుంబాన్ని కాపాడుకునేందుకు తమ వంతు కృషి చేశామన్నారు. అలాగే తెలంగాణ కోసం అధిష్టానం వద్ద తమ ప్రయత్నాలు తాము చేశామన్నారు. అడుగడుగునా తమను ప్రజలు నిలదీశారన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకే తాము ఎన్ని అవమానాలు ఎదురైనా భరించామన్నారు. అధిష్టానాన్ని ఆలోచింప చేశామన్నారు. తెలంగాణ సాధన ద్వారా కాంగ్రెసు చిత్తశుద్ధిని ప్రజలకు చెప్పేందుకు కృషి చేశామన్నారు. పార్లమెంటులో తమ ఎంపీలు కూడా తెలంగాణ కోసం తీవ్రంగా కృషి చేశారన్నారు. తెలంగాణ పరిష్కారం దిశలో కేంద్రం యోచిస్తున్న సమయంలో కొందరు నేతలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్నారని వాటిని తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు.
కేంద్రం ప్రకటన తర్వాత ఎవరూ బలాబలాల ప్రదర్శకు తెరలేపవద్దన్నారు. ఏళ్ల తరబడి నలుగుతున్న తెలంగాణకు పరిష్కారం వస్తే ఆంధ్ర ప్రదేశ్కు మంచిదని అభిప్రాయపడ్డారు. ఇది ఆధిపత్య సమస్య కాదన్నారు. తాము సీమాంధ్ర ప్రజలను ఎప్పుడూ వ్యతిరేకించలేదన్నారు. అధఇష్టానం ఆదేశంతో ఇన్నాళ్లూ తాము సంయమనం పాటించామన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా ఇరు ప్రాంతాల ప్రజల మధ్య ఐక్యత కొనసాగుతుందన్నారు.
భారత్లోనే ఇరు రాష్ట్రాల తెలుగు ప్రజలు ఆదర్శవంతంగా ఉంటారని ఆశాభావం వ్యక్తం చేసారు. విభజన తర్వాత తెలుగు ప్రజలు దేశంలో తమ ప్రత్యేకతను చాటాలన్నారు. ఎవరూ రెచ్చగొట్టే కార్యక్రమాలు పెట్టుకోవద్దన్నారు. తెలుగు సామరస్యానికి విఘాతం కలిగించకూడదన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా ప్రజల మధ్య ఐక్యతను తాము కోరుకుంటున్నామన్నారు. కుటుంబ సమస్యగా దీనిని పరిష్కారించేందుకు సీమాంధ్ర నేతలు కృషి చేయాలన్నారు.