'తెలంగాణ ఏర్పాటు అవాస్తవం: విభజనతో నీటి సమస్య'
తాను వ్యక్తిగతంగా సమైక్యవాదిని అని మంత్రి డిఎల్ రవీంద్రా రెడ్డి కడప జిల్లాలో అన్నారు. రాష్ట్ర విభజన అంటూ జరుగుతున్న ప్రచారం తప్పు అన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరగడం లేదన్నారు. తెలంగాణ ఏర్పాటు అంటూ తప్పుడు ప్రచారం జరుగుతోందన్నారు. తన ఓటు సమైక్యవాదానికే అని డిఎల్ రవీంద్రా రెడ్డి అన్నారు. తెలంగాణ రావొచ్చు.. రాకపోవచ్చు.. కానీ తాను సమైక్యవాదినే అన్నారు. సమైక్యవాదంపై ప్రజల్లో స్పందన లేనప్పుడు ఎంతమంది రాజీనామా చేసినా వృథానే అన్నారు.
మా ప్రాంత ప్రజల మనోభావాలు చెప్పేందుకే
తమ ప్రాంత మనోభావాలను తన పార్టీ అధిష్టానానికి చెప్పేందుకే తాము వచ్చామని మంత్రులు టిజి వెంకటేష్ ఏరాసు ప్రతాప్ రెడ్డి, విశ్వరూప్, కాసు వెంకట కృష్ణా రెడ్డిలు ఢిల్లీలో అన్నారు. సమైక్య గళం వినిపించేందుకు వారు ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. తమ ప్రాంత ప్రజల మనోభావాలని అధిష్టానానికి వినిపిస్తామన్నారు.
సమైక్య రాష్ట్రంలోనే రాయలసీమ ప్రాంతంలో నీటి కోసం ఇబ్బందులు తలెత్తుతున్నాయని, ఇక రాష్ట్ర విభజన జరిగితే నీటి సమస్యలు ఇంకా పెరుగుతాయన్నారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలన్నారు. సీమాంధ్ర నేతల సమావేశాన్ని అడ్డుకుంటామని చెప్పడం సరికాదన్నారు.