తెలంగాణ రాజకీయం: వేడెక్కిన ఢిల్లీ, నేతలు క్యూ

ఇదిలావుంటే, ఈ నెల 17వ తేదీన సీమాంధ్ర నేతలు సదస్సు తలపెట్టారు. ఈ సదస్సులో సమైక్యవాదాన్ని బలంగా వినిపించి ఆ మేరకు పార్టీ అధిష్టానానికి విజ్ఞప్తి చేయనున్నట్లు చెబుతున్నారు. ఢిల్లీ వెళ్లిన నేతలు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఇతర అధిష్టానం పెద్దలను కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తెలంగాణ ఇవ్వడానికి కాంగ్రెసు అధిష్టానం సుముఖంగా ఉందంటూ సంకేతాలు అందుతున్నట్లు వస్తున్న వార్తలు వస్తున్న నేపథ్యంలో సీమాంధ్ర నేతలు చురుగ్గా కదులుతున్నారు.
మరోవైపు పిసిసి మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ మంగళవారం ఢిల్లీలో సోనియాను కలిశారు. జైపూర్లో సమావేశంలో తెలంగాణపై చర్చించేలా ఆయన కీలక నోట్ సమర్పించినట్లు తెలిసింది. తెలంగాణకు పరిష్కారం చూపడంతోపాటు రాష్ట్రంలో బీసీలకు నాయకత్వం అప్పగించాలని ఆయన కోరినట్లు సమాచారం. సోనియాను కలిసి వచ్చిన తర్వాత తెలంగాణ పార్లమెంటు సభ్యులు డి. శ్రీనివాస్తో సమావేశమయ్యారు.
మొత్తం మీద ఈనెల 28లోపు తెలంగాణపై ఏదో ఒక ప్రకటన రావడం ఖాయమనే భావన నేతలందరిలో కనిపిస్తోంది. గతంలో విభజన అంశాన్ని అధిష్ఠానం పెద్దల వద్ద ప్రస్తావించినప్పుడు వారి నుంచి స్పందన కనిపించేది కాదని, ఇప్పుడు ఏం చేస్తే బాగుంటుందో చెప్పాల్సిందిగా కోరుతున్నారని అంటున్నారు. దీన్ని బట్టి తెలంగాణపై అధిష్ఠానం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉందనే విషయం అర్థమవుతోందని అంటున్నారు.












Click it and Unblock the Notifications