తెలంగాణ వచ్చే పరిస్థితి మెండుగా ఉంది: టిజి వెంకటేష్
తెలంగాణకు అధిష్టానం అనుకూలంగా ఉంది కాబట్టే తాము ఇలా తిరగాల్సి వస్తోందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రాంత కాంగ్రెసు నాయకుల ఇబ్బందులను అధిష్టానం తమకు చెప్పిందని ఆయన అన్నారు. తెలంగాణ పార్లమెంటు సభ్యుల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని అధిష్టానం నాయకులు తమతో చెప్పిందని ఆయన అన్నారు. సమస్య పరిష్కారానికి ఏం చేయాలో చెప్పాలని తమనే అధిష్టానం అడిగిందని ఆయన అన్నారు. విడిపోవడానికి ఆందోళనలు జరుగుతాయని, రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని పోరాటాలు చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు. విడిపోయి కలిసి ఉండడానికి పోరాటాలు ఉండవని ఆయన అన్నారు.
రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్రలో ఆందోళనలు చెలరేగుతాయని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే నీటి సమస్య తలెత్తుతుందని, నీటి యుద్ధాలు జరుగుతాయని ఆయన అన్నారు. దేశంలోని సమస్యలతో తెలంగాణ సమస్య ఇమిడి ఉందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజిస్తే దేశంలోని ఇతర ప్రాంతాల్లో కూడా విభజనకు ఉద్యమాలు చెలరేగుతాయని ఆయన అన్నారు. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అవి తలెత్తే అవకాశాలున్నాయని ఆయన అన్నారు.
తమ ప్రాంత ప్రజల ఆవేదనను తాము అధిష్టానానికి విన్నవించామని ఆయన చెప్పారు. తెలంగాణలో భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి కదా అని వాయలార్ రవి, ఆజాద్ అన్న మాటలను బట్టి తెలంగాణకు అనుకూలంగా అధిష్టానం ఉన్నట్లు అర్థమవుతోందని ఆయన అన్నారు. రాష్ట్రంలోని అన్ని పార్టీలు తెలంగాణకు అనుకూలంగా మాట్లాడాయని ఆయన అన్నారు. తాము తెలంగాణకు వ్యతిరేకం కాదని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ కూడా అన్నారని ఆయన గుర్తు చేశారు. అదృష్టవశాత్తు శానససభలో తీర్మానం చేయలేదు కాబట్టి కాంగ్రెసు అభిప్రాయం వ్యక్తం కాలేదని ఆయన అన్నారు. తీర్మానం శాసనసభలో నెగ్గి ఉంటే అప్పుడే తెలంగాణ ఇచ్చేవాళ్లేమోనని ఆయన అన్నారు.
ఎన్నికల ప్రణాళికలో తెలంగాణ అంశాన్ని పెట్టి, ఆ తర్వాత ప్రజాభిప్రాయం మేరకు తెలంగాణపై కాంగ్రెసు అధిష్టానం తీసుకునే విధంగా వెనక్కి తెలంగాణ అంశం వస్తుందేమో కూడా చెప్పలేమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. తెలంగాణపై ఏకాభిప్రాయం రాదని రాయలసీమకు చెందిన మరో రాష్ట్ర మంత్రి ఏరాసు ప్రతాప రెడ్డి చెప్పారు. విభజన జరిగితే రాయలసీమకు జరిగే అన్యాయం గురించి తాము అధిష్టానానికి వివరించామని ఆనయ అన్నారు. ఇది తెలంగాణకు వ్యతిరేకంగా పనిచేయడం కాదని ఆయన అన్నారు. తాము తెలంగాణను అడ్డుకోవడం లేదని, సమైక్యంగా ఉండాలని తాము గతంలో త్యాగాలు చేశామని, విడిపోవాలని అన్నప్పుడు తమ పరిస్థితి ఏమిటనే తాము తప్పకుండా అడుగుతామని ఆయన అన్నారు. తమ ప్రాంత ప్రజల స్పందనను అధిష్టానికి వివరించినట్లు టిజి వెంకటేష్ చెప్పారు.