జగన్ కోసం దొంగ సంతకాలు: చంద్రబాబు ఫైర్
వైయస్ జగన్ అక్రమాలకు పాల్పడలేదని నిరూపించగలరా అని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను అడిగారు. జగన్ అవినీతిపై యువత ఎస్సెమ్మెస్లతో దాడి చేయాలని, జగన్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం అమ్మపేట నుంచి మంగళవారం ఆయన పాదయాత్ర ప్రారంభించారు.
జగన్ విడుదల కోసం సంతకాలు సేకరిస్తున్నతీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జైల్లో ఉన్న అక్రమార్కుడి విడుదల కోసం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం సిగ్గుచేటు అని, అదీ దొంగ సంతకాలు పెట్టుకొని ఢిల్లీకి పోవడాన్ని మించిన దౌర్భాగ్యం లేదని ఆయన అన్నారు. యాత్రలో భాగంగా అమ్మపేటలోని రవీంద్రభారతి స్కూలును చంద్రబాబు సందర్శించారు.
కొద్దిసేపు టీచర్ అవతారం ఎత్తి కాలుష్య నివారణపై చిన్నారులకు అవగాహన కల్పించారు. విద్యార్థి దశనుంచే పర్యావరణంపై అవగాహన పెంచుకోవాలని, ఒక్కొక్క రు ఓ చెట్టును నాటి దాని సంరక్షణ బాధ్యతలు తీసుకోవాలని సూచించారు. తాను ముఖ్యమంత్రిని అయితే మెరుగైన విద్య, సరిపడా ఉపాధి, నిరుద్యోగ భృతి కల్పిస్తానని చెప్పారు. ఆడపిల్లలను ప్రోత్సహించేందుకు తన హయాంలో ప్రవేశపెట్టిన 'ఉచిత సైకిల్' పథకాన్ని ఈసారి బాలురకూ వర్తింపజేస్తానని, అదనంగా ల్యాప్టాప్ కూడా అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో కలిసిన మహిళల సమస్యలను ఆరా తీశారు.
మహిళలు ముందుకొస్తే ప్రభుత్వ డ్రైవర్లుగా ఉద్యోగాలిస్తానని చెప్పారు. మహిళా సంక్షేమం, విద్యా ఉద్యోగాల్లో 33శాతం రిజర్వేషన్ కల్పిస్తాననిస స్త్రీ స్వావలంబనే లక్ష్యంగా డ్వాక్రా సంఘాలను పునఃనిర్మిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. మళ్లీ అధికారంలోకి వస్తే మెరుగైన జీవనాన్ని అందిస్తా'నని హామీ ఇచ్చారు.
తెలుగుదేశం నాయకులంతా కాంగ్రెస్లో చేరాలంటూ డిప్యూటీ స్పీకర్ మల్లు భట్టి విక్రమార్క బెదిరిస్తున్నారని, ముఖ్యమంత్రి సహకారంతో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారని ఆరోపించారు. మల్లు భట్టి విక్రమార్క వంటివారికి భయపడేది లేదని ఆయన అన్నారు.