హైదరాబాద్‌‌లో గెలుస్తావా: కెసిఆర్‌కు లగడపాటి సవాల్

Lagadapati Rajagopal
విజయవాడ: హైదరాబాద్‌లో పోటీ చేసి గెలిస్తురా అని కాంగ్రెసు విజయవాడ కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావును సవాల్ చేశారు. హైదరాబాదులో పోటీ చేసి కెసిఆర్ గెలిస్తే తాను సమైక్యవాదం గురించి మాట్లాడబోనని ఆయన అన్నారు. హైదరాబాదు, సికింద్రాబాదుల్లో తెరాస ఓటమి ఖాయమని ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అన్నారు. హైదరాబాదులో రెఫరెండానికి కెసిఆర్ సిద్ధం కావాలని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో సమైక్యవాదం సత్తా ఏమిటో చూపిస్తామని ఆయన అన్నారు.

మీరు హైదరాబాదులో పోటీ చేస్తారా అని అడిగితే తనకు ఆ వెసులుబాటు లేదని, తమ అధిష్టానం పోటీ చేయాలని ఆదేశిస్తే పోటీ చేస్తానని ఆయన సమాధానమిచ్చారు. శాసనసభలో తీర్మానం పెడితే సమైక్యవాదమే గెలుస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి లేఖ వల్ల విభజనకు మెజారిటీ ఉందనే అపోహ కేంద్ర ప్రభుత్వానికి కలిగిందని ఆయన అన్నారు. చంద్రబాబు కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు వేర్పాటువాదం వల్ల జరిగే నష్టాలను తాను వివరిస్తానని ఆయన చెప్పారు.

చంద్రబాబు వేర్పాటువాదం వల్ల ఎన్టీ రామారావు ఆత్మ క్షోభిస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఎన్టీఆర్ చేసిన ప్రసంగాలతో, సి. నారాయణ రెడ్డి ఎన్టీ రామారావు సినిమా కోసం రాసిన తెలుగుజాతి మనది అనే పాటతో ఓ సిడిని రూపొందించామని, ఈ నెల 27వ తేదీన కృష్ణా జిల్లాకు వచ్చినప్పుడు చంద్రబాబుకు అందిస్తామని ఆయన చెప్పారు. చంద్రబాబును తాను ప్రేమగా అహ్వానించి, విభజన వల్ల అన్ని వర్గాలకు ఎలా అన్యాయం జరుగుతుందో వివరిస్తానని, వింటే వింటారు వినకపోతే చంద్రబాబు ఇష్టమని ఆయన అన్నారు.

మెజారిటీ ప్రజలు సమైక్యతను కోరుకుంటున్నారని ఆయన చెప్పారు. తెలంగాణకు ఏకాభిప్రాయం రాలేదని, అసెంబ్లీలో తీర్మానం చేస్తే వీగిపోతుందని, అందువల్ల తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఏ మాత్రం లేదని ఆయన అన్నారు. ఏకాభిప్రాయం ఉంటేనే విభజనపై నిర్ణయం తీసుకుంటామని ప్రధాని సహా పలువురు కేంద్ర మంత్రులు చెప్పారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం అంటే నవ్వుల పాలవుతారని ఆయన అన్నారు. రాజ్యాంగపరంగా రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని అంటున్నారని, అయితే తంతాం, పొడుస్తాం అంటే రాష్ట్రం ఇస్తారా అని, అలా ఇస్తే దేశం ముక్కలు చెక్కలు అవుతుందని ఆయన అన్నారు.

రాజకీయ నిరుద్యోగుల కోసం తెలంగాణ ఇస్తే దేశం విచ్చిన్నమవుతుందని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో సమైక్యవాద పార్టీలు విజయం సాధిస్తాయని ఆయన అన్నారు. తెలంగాణవాదం తాత్కాలిక ఆవేశం మాత్రమేనని ఆయన అన్నారు. కాంగ్రెసు విధానం రెండో ఎస్సార్సీ అని ఆయన అన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీకి పూర్తి మెజారిటీ వస్తేనే రెండో ఎస్సార్సిని వేసే అవకాశం ఉందని ఆయన అన్నారు. రెండు సీట్లున్న సిపిఐ నారాయణ వల్ల ఒరిగేదేమీ లేదని ఆయన వ్యాఖ్యానించారు.

తెలంగాణ సమస్య మెడ మీద కత్తిలా ఉందని, కేంద్రంపై చంద్రబాబు బాధ్యత పెట్టడం సరి కాదని ఆయన అన్నారు. చంద్రబాబు కళ్లకు గంతలున్నాయని ఆయన అన్నారు. కళ్లు మూసుకుంటాం, కళ్లు తెరవబోమని చంద్రాబబు అంటే తనకేమీ అభ్యంతరం లేదని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని విభజిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన చెప్పారు. రాష్ట్రాలు ఎలా ఏర్పడుతాయో తనకు తెలుసునని ఆయన అన్నారు. తమ పార్టీవాళ్లు తనపై చేసిన విమర్శల మీద బహిరంగంగా మాట్లాడబోనని ఆయన చెప్పారు. ఇతర పార్టీలపై బహిరంగంగా మాట్లాడడానికి మాత్రమే అవకాశం ఉందని, ఇతర వేదికలు లేవని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+