బాబుకు సమైక్య సెగ: జగన్ పార్టీకి ఎమ్మెల్సీ బొడ్డు
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై, సీనియర్ నేత యనమల రామకృష్ణుడిపై తీవ్ర విమర్శలు చేసిన బొడ్డు భాస్కర రామారావు తాను ఏ పార్టీలో చేరేది మాత్రం చెప్పలేదు. సమైక్యవాదానికి అండగా నిలిచే పార్టీలో చేరుతానని మాత్రమే చెప్పారు. చంద్రబాబు కేంద్రానికి రాసిన లేఖ వల్లనే తెలంగాణకు అనుకూలంగా పరిస్థితులు మారాయని బొడ్డు భాస్కర రామారావు విమర్శించారు. అవసరమైతే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేస్తానని ఆయన చెప్పారు. అఖిల పక్ష సమావేశంలో సమైక్యవాదాన్ని వినిపించడంలో తెలుగుదేశం పార్టీ విఫలమైందని ఆయన వ్యాఖ్యానించారు.
తెలంగాణపై అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలనే కోరే విషయంలో చంద్రబాబు తొందర పడ్డారని, చంద్రబాబు లేఖ కారణంగానే రాష్ట్ర విభజనకు అనుకూలంగా పరిస్థితి మారిందని విమర్శించారు. యనమల రామకృష్ణుడిపై కూడా ఆయన ధ్వజమెత్తారు. ప్రజలను మభ్యపెట్టడానికే యనమల రామకృష్ణుడు ప్రజలను మభ్య పెట్టేందుకే తూర్పు గోదావరి జిల్లాలో పాదయాత్రలు చేస్తున్నారని ఆయన విమర్శించారు. తెలుగదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎవరు కూడా సీమాంధ్ర నాయకుల అభిప్రాయాలను పట్టించుకోవడం లేదని బొడ్డు భాస్కర రామారావు అన్నారు.
ఇదిలావుంటే, హైదరాబాదుపై తెలుగుదేశం పార్టీ నాయకుడు సుధీష్ రాంభొట్ల మరోసారి గొంతు విప్పారు. హైదరాబాదులో పోటీ చేస్తే తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కి ఒక్క ఓటు వేసినా తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని ఆయన శనివారం చెప్పారు. హైదరాబాదు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మట్టి కొట్టుకుపోతారని ఆయన అన్నారు. హైదరాబాదును దృష్టిలో పెట్టుకుని విభజనపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలని ఆయన అన్నారు.
హైదరాబాదులో రెఫరెండం పెట్టాల్సిందేనని, అవసరమైతే రాజకీయాల్లో రెఫరెండాన్ని పక్కన పెట్టవద్దని ఆయన అన్నారు. తాను తెలంగాణను అడ్డుకోవడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును సానుకూలం చేయడానికే తాను హైదరాబాదు సమస్యను పరిష్కరించాలని కోరుతున్నట్లు ఆయన తెలిపారు. రెఫరెండం ప్రభుత్వ బాధ్యత కూడా అని ఆయన అన్నారు.