ఎఐసిసి ఉపాధ్యక్షుడిగా రాహుల్ గాంధీ నియామకం
వచ్చే ఎన్నికల్లో రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలని చాలా మంది నాయకులు పట్టుబట్టారు. జ్యోతిర్ ఆదిత్య సిందియా, రాజీవ్ శుక్లా లతో పాటు మణి శంకర్ అయ్యర్ వంటి వారు సైతం రాహుల్కు మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని కోరారు.
యువతరాన్ని ఆకట్టుకునేందుకు రాహుల్ గాంధీకి పూర్తి స్థాయిలో నాయకత్వ బాధ్యతలు అప్పగించాలని సీనియర్ నాయకులు కూడా అన్నారు. జైపూర్లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ చింతన్ శిబిర్లో ప్రతి ఒక్కరి మాటా యువతరానికి మరింత బాధ్యతలు, మరింత గుర్తింపు, మరింత అధికారం అప్పగించాలన్నదే తప్ప మరొకటి కాదని మిలింద్ దేవ్రా గట్టిగా వాదించినట్టు తెలుస్తున్నది.
శనివారం ఉదయం చింతన్ శిబిర్ చర్చలు ప్రారంభం కావడానికి ముందు పార్టీ నాయకుడు సంజయ్ నిరుపమ్ మాట్లాడుతూ 2014 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని రాహులే నడిపిస్తారని, ప్రధాని అభ్యర్థి కూడా రాహుల్ గాంధీయేనని అని వ్యాఖ్యానించారు. ఉత్తర ప్రదేశ్ నాయకుడు జితేందర్ ప్రసాద కూడా ఇవే మాటలు మాట్లాడారు. 2014 సార్వత్రిక ఎన్నికలలో పార్టీని నడిపించేదీ రాహులే, దేశాన్ని నడిపించేది కూడా రాహులే అని ఆయన వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీకి నాయకత్వం అప్పగించాలని దిగ్విజయ్ సింగ్ కూడా సూచించారు.
కేంద్ర మంత్రి వీరప్ప మొయిలీ కూడా దాదాపు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఇప్పటికే రాహుల్ తమనాయకుడు అని అన్నారు. తమకు మంచి నాయకులు ఉన్నారని, స్థిరంగా ఆలోచించే నాయకులు ఉన్నారని, వారంతా తమకు గర్వకారణమని ఆయన అన్నారు. రాహుల్కు పార్టీలో మరింత కీలకమైన బాధ్యతలు అప్పగించాలని పెక్కుమంది కోరడంపై కేంద్ర మంత్రి రాజీవ్ శుక్లా స్పందిస్తూ ఈ అంశంపై అంతిమ నిర్ణయం తీసుకోవలసింది సోనియా, రాహులేనని వ్యాఖ్యానించారు. రాహుల్కు మరింత బాధ్యతను అప్పగించాలని తాము ఎంతో కాలంగా కోరుతున్నామని, అది జరిగేవరకూ కోరుతూనే ఉంటామని ఆయన అన్నారు.
కాగా, ఒకరి ఒకే పదవి అనే విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని రాహుల్ గాంధీ శనివారం చింతన్ శిబిర్లో సూచించారు. జోడు పదవులను నాయకులు అన్ని స్థాయిల్లో వదులుకోవాలని ఆయన సూచించారు. పార్టీలో సామాజిక న్యాయాన్ని తెస్తామని ఆయన అన్నారు. పార్టీ, ప్రభుత్వాల్లో యువతకు ప్రాధాన్యం ఇస్తామని ఆయన చెప్పారు.