ముడిపెట్టొద్దు: ప్రధాని సమక్షంలో విహెచ్ తెలం'గానం'
కేంద్ర మంత్రి ఏకే ఆంటోనీ అధ్యక్షతన రాజకీయ సవాళ్ల అంశంపై ఏర్పాటు చేసిన కమిటీలో మన రాష్ట్రం నుంచి జైపాల్ రెడ్డి, వి.హనుమంతరావు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, ఎన్ఎస్యూఐ నాయకుడు అంజాద్ కూడా సభ్యులుగా ఉన్నారు. దీనిపై జరిగిన చర్చలో కేంద్ర హోం మంత్రి సుశీల్కుమార్ షిండే ఆద్యంతం పాల్గొన్నారు. ప్రధాని మన్మోహన్ కొద్దిసేపు చర్చ జరుగుతున్న తీరును పరిశీలించారు.
ప్రధాని అక్కడ ఉన్న సమయంలోనే విహెచ్ తెలంగాణపై మాట్లాడారు. నిజాం పాలన నుంచి ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు వరకు సంభవించిన పరిణామాలను హనుమంతరావు వివరించారు. తెలంగాణ ఏర్పాటును ఒక రాష్ట్రాన్ని విభజించడంగా పరిగణించకూడదని, గతంలో జరిగిన విలీనం నుంచి వేరుపడటంగానే చూడాలని ఆయన కోరారు.
దేశంలోని ఇతర రాష్ట్రాల్లో ఉన్న చిన్నరాష్ట్రం డిమాండ్లను తెలంగాణతో పోల్చలేమని అభిప్రాయపడ్డారు. హనుమంతరావుకు జార్ఖండ్, ఉత్తరాఖండ్లకు చెందిన ఇద్దరు ఎన్ఎస్యూఐ నాయకుల నుంచి మద్దతు లభించింది. తెలంగాణ ఇస్తూ, సీమాంధ్రలో కూడా పార్టీని బలోపేతం చేసే చర్యలు చేపట్టాలని హనుమంతరావు సూచించారు.
వైయస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వ హయాంలో దోచుకున్న డబ్బుతో ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కాంగ్రెస్నే ఎదురిస్తున్నాడని, సీమాంధ్రలో జగన్కు గట్టి సమాధానం చెప్పాలని అన్నారు. దేశంలోయువత ఉపాధి అవకాశాలను పెంచేందుకు నైపుణ్యానికి మెరుగులు దిద్దాలని సామాజిక-ఆర్థిక బృందం తీర్మానించింది. రాష్ట్రంలోని రాజీవ్ యువకిరణాల పథకం తరహాలో అన్ని రాష్ట్రాల్లోనూ యువత నైపుణ్యాన్ని పెంచాలని నిర్ణయించింది.