జిల్లాలోకి బాబు, సమైక్య సెగ: లగడపాటి ఇంటికి తాళం!

లగడపాటి బస చేసిన ఇంటికి తాళం
చంద్రబాబును కలిసి కనువిప్పు కలిగిస్తానన్న విజయవాడ పార్లమెంటు సభ్యుడు లగడపాటి రాజగోపాల్ బస చేసిన ఇంటికి పోలీసులు తాళం వేశారు. లగడపాటి అనుమంచిపల్లికి రాత్రే వచ్చి బస చేశారు. ఉదయం బాబును కలుద్దామనుకున్నారు. కానీ పరిస్థితులు ఉద్రిక్తంగా మారుతాయని భావించిన పోలీసులు అతనిని అనుమతించలేదు. అతనిని అరెస్టు చేసేందుకు ప్రయత్నాలు చేశారు.
ఇంటిలో నుండి లగడపాటి ఎంతకు బయటకు రాకపోవడంతో పోలీసులు అతనిని గృహ నిర్బంధం చేశారు. అతను ఉన్న ఇంటికి తాళం వేశారు. సమైక్యాంధ్ర కోసం సీమాంధ్ర కాంగ్రెసు ప్రజాప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి ఒత్తిడి తెచ్చే ప్రయత్నాలు చేస్తుంటే లగడపాటి ఇక్కడ డ్రామాలు ఆడుతున్నారని టిడిపి సీనియర్ నేత యనమల రామకృష్ణుడు మండిపడ్డారు.
కీసర వద్ద ఉద్రిక్తత
పలువురు కాంగ్రెసు నేతలు బాబును కలిసే ప్రయత్నాలు చేశారు. వీరిని పోలీసులు ఎక్కడికి అక్కడ అడ్డుకున్నారు. మల్లాది విష్ణు, జోగి రమేష్, వెల్లంపల్లి శ్రీనివాసులు, యలమంచిలి రవి, దేవినేని నెహ్రూ, దేవినేని అవినాష్ తదితరులను పోలీసులు ఎక్కడికి అక్కడ అదుపులోకి తీసుకున్నారు. కీసరలో జోగి రమేష్, వెంకటరమణల మధ్య వాగ్వాదం జరిగింది. ఇది ఉద్రిక్తతకు దారి తీసింది. ఈ ఘటనలో డిఎస్పీ చెన్నయ్యకు స్వల్ప గాయాలయ్యాయి. బాబు యాత్ర, కాంగ్రెసు నేతల ర్యాలీల నేపథ్యంలో విజయవాడ హైవైపై భారీగా ట్రాఫిక్ జాం అయింది. బాబును పలువురు సమైక్యవాదులు నిరసన తెలిపే ప్రయత్నాలు చేశారు.












Click it and Unblock the Notifications