తెలంగాణపై కెవిపి తెర వెనక కుట్ర: కోదండరామ్ ఫైర్
తాము సీమాంధ్ర ప్రజలకు వ్యతిరేకం కాదని, అక్కడి ప్రజలు కూడా సమైక్య వాదాన్ని కోరుకోవడం లేదని ఆయన అన్నారు. రెండు ప్రాంతాలకు చెందిన ప్రజలు ఇష్టంగా ఉంటేనే సమైక్యవాదం అంటారని కోదండరామ్ అంటూ ఏనాడైనా సీమాంధ్ర పాలకులు తెలంగాణ ప్రజల గురించి పట్టించుకున్నారా అని ఆయన అడిగారు.
తెలంగాణ అంశం కీలక దశకు చేరుకుంటున్న సమయంలో అడ్డు పుల్ల వేస్తున్నారని, తమ ఆధిపత్యం చెలాయించుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు పన్నుతున్నారని విమర్శించారు. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ కేసుల్లో మూల సూత్రధారి అయిన కెవిపి రామచంద్ర రావు కోట్ల రూపాయలు ఆర్జించి తెర వెనుక ఉండి నాటకాలాడుతున్నారని ధ్వజమెత్తారు. విచ్చలవిడిగా డబ్బును వెదజల్లి అధిష్ఠానాన్ని ప్రభావితం చేసేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ప్రజల ఆకాంక్షను గౌరవిస్తారా డబ్బులకు లొంగుతారా అనే విషయం త్వరలోనే తేలిపోతుందని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ తెలంగాణలో భాగమని దాని గురించి చర్చించడం అనవసరమని అన్నారు. ఈ నెల 27న హైదరాబాద్లో సమరదీక్ష చేపడుతున్నామని, తెలంగాణ ప్రకటించకుంటే దానికి కార్యాచరణ ఉందని అన్నారు. సీమాంద్రులు తమ ఆధిపత్యం నిలబెట్టుకోవడానికి సభలు, సమావేశాలు ఏర్పాటుచేస్తున్నారన్నారు. కొన్ని టీవీ చానళ్లు కూడా వారికే మద్దతు ఇస్తున్నాయని ఆరోపించారు.
దానం నాగేందర్ తెలంగాణకు మద్దతు ప్రకటించాలని లేకపోతే ఎమ్మెల్యే, మంత్రి పదవికి రాజీనామా చేసి మాట్లాడాలని డిమాండ్ చేశారు. కాగా, ఈనెల 28న తెలంగాణపై కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయకుంటే 29న తెలంగాణ జిల్లాల్లో సంపూర్ణ బంద్కు పిలుపునిస్తున్నట్లు టీఎస్, ఓయూ విద్యార్థి జేఏసీ పిలుపునిచ్చింది.