కెసిఆర్ రాదని,వస్తే బాబు.: బయటకు లగడపాటి, అరెస్ట్
మధ్యాహ్నం ఒకటి గంటల సమయంలో ఆయన ఇంట్లో నుండి బయటకు వచ్చారు. భారీగా కార్యకర్తలు, సమైక్యవాదులు, కాంగ్రెసు నేతలు తరలి వచ్చారు. ఈ సందర్భంగా లగడపాటి మాట్లాడారు. బాబుకు గులాబీ పువ్వు ఇచ్చి తాను జిల్లాలోకి స్వాగతం పలుకుదామనుకున్నానని కానీ, టిడిపి నేతలు పోలీసుల సహాయంతో తనను బయటకు రాకుండా చేశారన్నారు. బాబును కలవాలనే ఆరు గంటల పాటు ఇంట్లోనే ఉండిపోయానన్నారు.
తనకు మద్దతుగా భారీగా సమైక్యవాదులు తరలి వచ్చారన్నారు. బాబును కలిసేందుకు వెళుతున్న పలువురు నేతలను, కార్యకర్తలను టిడిపి నేతలు పోలీసుల అడ్డుకున్నారని, వారిని అరెస్టు చేయించారని ఆయన మండిపడ్డారు. తెలుగు రాష్ట్రానికి విభజన పెనుముప్పు పొంచి ఉన్న తరుణంలో వేర్పాటువాదులకు కనువిప్పు కలిగించాలని తాను భావించానని అన్నారు. చంద్రబాబు తనను కలువమంటే నిరాకరించరట అన్నారు.
తెలంగాణకు అనుకూలంగా చెప్పిన తాను తనకు మొహం చూపించలేక చంద్రబాబు తనను కలిసేందుకు ఇష్టపడలేదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు రాష్ట్ర విభజనకు సై అని స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశయాలకు తూట్లు పొడిచారన్నారు. ఆయన పేరు తలిచే అర్హత టిడిపికి లేదన్నారు. తమను అరెస్టు చేసినా సమైక్యవాదం ఆగిపోదన్నారు. పొట్టి శ్రీరాములు ఆత్మార్పణం చేసి రాష్ట్రం సాధిస్తే కొందమంది స్వార్ధపరులు విభజనవాదాన్ని రెచ్చగొట్టారని ధ్వజమెత్తారు.
బాబు నిర్ణయంతో ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తుందన్నారు. బాబును చరిత్ర క్షమించదన్నారు. సీమాంధ్ర టిడిపి నేతలు సమైక్యవాదులా కాదా అని ప్రశ్నించారు. అలాంటప్పుడు 2009లో వారు రోడ్లెందుకు ఎక్కారని, ఎందుకు రాజీనామాలు చేశారని ప్రశ్నించారు. తాను తన స్వార్థం కోసం పోరాడటం లేదని, తెలంగాణ ప్రజల ఐక్యత కోసం, దీనిని బాబు అర్థం చేసుకొని తన దారిలోకి వస్తాడని ఆశిస్తున్నానని అన్నారు.
తెలంగాణ వచ్చాక హైదరాబాదు నుండి సీమాంధ్రులను తరిమేస్తే పరిస్థితి ఏంటన్నారు. ఆవేశంతోనే, ఉద్రేకంతోనే తాను ఇలా చేయడం లేదని సీమాంధ్ర ప్రజల ఆందోళనను ఆవేదనగా చెబుతున్నానన్నారు. తెలుగు ప్రజల గురించి ఆలోచించమని బాబుకు చెబుతున్నానని అన్నారు. బాబుపై తనకు ఎలాంటి కోపం లేదన్నారు. ఎన్నికల్లో ఎవరు గెలిచారనేది తనకు ముఖ్యంకాదని, తెలుగు జాతి కలిసి ఉండాలన్నదే తన ఆకాంక్ష అన్నారు. స్వార్థ రాజకీయాల కోసం కెసిఆర్తో కలువొద్దన్నారు. తెలుగు జాతి సిగ్గుపడేలా టిడిపి వ్యవహరించిందన్నారు.
అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరన్నారు. కాగా అనుమంచిపల్లిలో ఇంట్లో ఉండిపోయిన లగడపాటి బయటకు వచ్చి మీడియా సమావేశంలో మాట్లాడిన అనంతరం పోలీసులు అతనిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడ నుండి విజయవాడకు తరలించారు. లగడపాటి బయటకు రావడంతో ఉదయం నుండి గ్రామంలో నెలకొన్న హైడ్రామాకు తెరపడింది.