జగన్ పార్టీకే ఓటు: కాంగ్రెస్ పెద్దిరెడ్డి తిరుగుబాటు, రగడ
జగన్ పార్టీ అభ్యర్థికే ఓటు వేయాలని ఆయన తన అనుచరులకు సూచించారు. ఢిల్లీ పెద్దలు ఏమన్నా లెక్క చేయనన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి నిరంకుశ పాలనలో రాష్ట్ర ప్రజలు, కాంగ్రెసు నాయకులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పని చేసే వారికి కాంగ్రెసు పార్టీలో గుర్తింపు లేకుండా పోయిందన్నారు. కిరణ్ కుమార్ రెడ్డికి వ్యవసాయం గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు. కిరణ్ సర్కారు రైతులకు ఏమీ చేయలేదన్నారు.
తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు సైతం రైతు సమస్యల పట్ల అవగాహన లేదన్నారు. దివంగత వైయస్ రాజశేఖర రెడ్డి రైతుల కోసం ఎంతో సేవ చేశారని చెప్పారు. కాంగ్రెసు పార్టీలో 35 ఏళ్లుగా పని చేస్తున్నానని అయినా అధిష్టానం గుర్తించలేదన్నారు. అంకిత భావం కలవారికి కాంగ్రెసులో ప్రాధాన్యం లేకుండా పోయిందన్నారు. జిల్లా సహకార ఎన్నికల్లో పార్టీలకతీతంగా ప్రచారం చేసి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పారు. పెద్దిరెడ్డి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు నారాయణ స్వామి, ఆదిమూలం తదితరులతో ఆయన భేటీ అయ్యారు.
బ్యానర్ల చించివేత
ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆదివారం చేపట్టిన వరదయ్యపాలెం మండల పర్యటన జగన్ పార్టీలో వివాదానికి తెరలేపింది. జగన్ పార్టీలో అగ్రకులాలకే ప్రాధాన్యం కల్పించి దళితులను విస్మరించారని సమావేశానికి వెలుపల దళిత నాయకుడు నాగేశ్వర రావు ఆరోపించారు. అసహనానికి గురైన పెద్దిరెడ్డి అర్ధాంతరంగా ప్రసంగాన్ని ముగించుకొని వెనుదిరిగారు. దళిత నేతలు ఆగ్రహం వ్యక్తం చేసి బ్యానర్లను చించివేశారు.