సోనియా కోర్టులో తెలంగాణ బంతి, తుది ఉత్కంఠ
తెలంగాణపై సోనియాకు అన్ని విషయాలూ చెప్పామని, ఆమెనే తుది నిర్ణయం తీసుకోవాలని ఎఐసిసి రాష్ట్ర వ్యవహారాల పరిశీలకుడు, కేంద్ర మంత్రి వాయలార్ రవి అన్నారు. కాంగ్రెస్ మేధోమథన సదస్సు ముగింపు సందర్భంగా ఆదివారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తెలంగాణపై మేధోమథనంలో ఎలాంటి చర్చా జరగలేదని చెప్పారు.
ఇంకా తమకూ, ఆంధ్రప్రదేశ్ నాయకులకు మధ్య చర్చలు జరగాల్సి ఉందని అన్నారు. ఇప్పటివరకు నిర్ణయం కూడా తీసుకోలేదని, అయితే ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీపై చాలా ఒత్తిడి ఉందని చెప్పారు. ఇంకా ఎక్కువ వివరాలు కావాలంటే మాత్రం రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి గులాం నబీ ఆజాద్నే అడగాలి తప్ప తనను అడగొద్దని అన్నారు.
కాగా, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ వైయస్ జగన్ పార్టీతో పొత్తుపై చేసిన వ్యాఖ్యల గురించి ప్రశ్నించగా.. 'అవునా.. నేను అలా ఏమన్నాను' అని ఎదురు ప్రశ్నించారు.
అయితే, ఇప్పుడు అందరి దృష్టి మాత్రం తెలంగాణపై సోనియా గాంధీ ఏం చేయబోతున్నారనే విషయంపైనే ఉంది. విభజనకు సముఖంగా ఉన్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ ముఖ్యమంత్రి హైదరాబాదుపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే ఆసక్తికరంగా మారింది.