మీరు ఆలోచిస్తే మేమూ అంతే: తేల్చిచెప్పిన ఆజాద్, క్లాస్
ఆజాద్ను కలిసిన నేతలు... రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని, విభజించవద్దని విజ్ఞప్తి చేశారు. దానికి ఆజాద్ తెలంగాణ అంశంపై స్పందించకుండా ఎప్పుడు ఏం నిర్ణయం తీసుకోవాలో తమకు తెలుసునని, మీరు చెప్పాల్సిన అవసరం లేదని అన్నట్లుగా తెలుస్తోంది. మీరు కేవలం నియోజకవర్గాలకే పరిమితం కాకుండా 2014 ఎన్నికల్లో గెలుపు పైన దృష్టి సారించాలని సూచించారు. ఎన్నికలకు ఎలా వెళ్లాలో ఢిల్లీ నుండి చార్ట్ ఇస్తామని మీరు అలాగే ప్రజల్లోకి వెళ్లాలని సూచించారు.
మంత్రులు నియోజకవర్గాలకే పరిమితం అవుతున్నారని జిల్లాలో పార్టీ బలోపేతం కోసం పని చేయాలన్నారు. అసలు మీరు ఎన్నికల్లో గెలువగలరా అని ప్రశ్నించారు. గెలుస్తామంటే ఎలా గెలుస్తారో చెప్పాలన్నారు. మీ పైన మీకు నమ్మకముందా అని ప్రశ్నించారు. 2014 ఎన్నికలకు సమాయత్తం కావడం మనముందున్న ప్రధాన లక్ష్యమన్నారు. మాస్ కాంటాక్ట్ ప్రోగ్రామ్స్లో ఉండాలని సూచించారు. ఎన్నికల పైన కాకుండా ఇతర అంశాలు ఆలోచిస్తే మేమూ ఆలోచిస్తామని హెచ్చరించారు.
నా ఒక్కడి చేతుల్లో లేదు
తెలంగాణపై ఏ నిర్ణయమైనా అధినాయకత్వమే తీసుకుంటుందని ఆయన సీమాంధ్ర నేతలకు చెప్పారు. 2004లో రాష్ట్ర ఇంచార్జిగా తానే ఉన్నానని, అప్పుడు ఏం చెప్పామో తనకు తెలుసునని అన్నారు. ఎన్నికలప్పుడు తెలంగాణపై ఏం చెప్పామో తమకు తెలుసునన్నారు. 2009లో ఏం చెప్పామో కూడా తనకు తెలుసునని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. తెలంగాణ అంశం తన ఒక్కడి చేతుల్లో లేదని, 40 మంది కేంద్రమంత్రులు, సోనియా, ఇతర ముఖ్య నేతలు సమస్యను పరిష్కరిస్తారని చెప్పారు.
అవాక్కయిన నేతలు
తాము విభజన అంశంపై కలిస్తే ఆజాద్ క్లాసు పీకడంతో సీమాంధ్ర నేతలు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తాము ఒకదానికి గురించి వస్తే పార్టీ బలోపేతం గురించి మాట్లాడటంతో వారికి ఏమీ పాలుపోలేదు. అయితే ఆజాద్ తమకు క్లాసు పీకినట్లుగా వస్తున్న వార్తలను వారు ఖండించారు. కాగా పార్టీ బలోపేతం గురించి క్లాసు పీకిన ఆజాద్ చివరగా అందరూ కలిసి ఉండండని చెప్పారట. ఈ వ్యాఖ్యలు సమైక్యానికి అనుకూలంగా వారు భావిస్తున్నారని అంటున్నారు. ఆజాద్తో భేటీ అనంతరం సీమాంధ్ర నేతలు మాట్లాడుతూ తమ ఆవేదనను ఆజాద్ సావధానంగా విన్నారని చెప్పారు.