డిఎన్ఎ రిపోర్టుతో భార్యపై అనుమానం: భర్త అరెస్టు
తన భర్త రమేష్పై భార్య యమున పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో డాక్టర్ భర్త రమేష్ను పోలీసులు సోమవారంనాడు అరెస్టు చేశారు. భార్యాబిడ్డల రక్తాన్ని ఓ ప్రైవేట్ టెక్నీషియన్ ద్వారా రహస్యంగా తీయించి, సిసిఎంబిలో డిఎన్ఎ పరీక్ష చేయించానంటూ రమేష్ చెబుతున్నాడు. తన భార్య యమునకు పుట్టిన బిడ్డకు తాను తండ్రిని కాదని అంటూ ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు.
సిసిఎంబి నుంచి తెచ్చానంటూ రమేష్ చూపుతున్న డిఎన్ఎ రిపోర్టుపై పోలీసులు దృష్టి పెట్టారు. ఆ నివేదిక అసలుదా, నకిలీదా అని తేల్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఓ ప్రైవేట్ వ్యక్తి అభ్యర్థన మేరకు సిసిఎంబి డిఎన్ఎ పరీక్షలు చేసి నివేదిక ఇవ్వవచ్చునా అనే కోణంలో కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. వారం, పది రోజుల్లో రమేష్ డిఎన్ఎ పరీక్షల నివేదికను ఎలా సంపాదించడానేది కూడా మిస్టరీగానే మారింది. డబ్బులు ఇచ్చి తాను సిసిఎంబి నుంచి నివేదికను సంపాదించానని రమేష్ చెబుతున్నట్లు ఓ ప్రముఖ తెలుగు టీవీ చానెల్ కథనం తెలియజేసింది.
టీవీ చానెళ్ల కథనం ప్రకారం - రంగారెడ్డి జిల్లా యాచారం మండలానికి చెందిన యమునతో అదే జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలోని రమేష్కు 22 ఏళ్ల క్రితం పెళ్లయింది. అయితే, వారికి చాలా కాలం పిల్లలు పుట్టలేదు. 25 రోజుల క్రితం యుమన ఓ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ పుట్టిన నాలుగైదు రోజులు రమేష్ బాగానే ఉన్నాడు. ఆ తర్వాత యమునపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆమెకు మరో వ్యక్తితో వైవాహికేతర సంబంధం ఉందంటూ ఆరోపించడం ప్రారంభించాడు. తనను రమేష్ మానసికంగా, శారీరకంగా హింసిస్తూ తనను వదిలించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడని యమున రమేష్పై పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ఒంటిపై కిరోసిన్ పోసి నిప్పంటించాడనికి కూడా ప్రయత్నించాడని ఆమె రమేష్పై ఫిర్యాదు చేసింది.