సోనియాభేటీ తర్వాతే: ఫలించిన ఒత్తిడి, ఎవరేమన్నారు?
ఫలించిన సీమాంధ్ర నేతల ఒత్తిడి
ఆజాద్ వ్యాఖ్యల ద్వారా తెలంగాణ విషయంలో సీమాంధ్ర నేతల ఒత్తిడి ఫలించినట్లుగా కనిపిస్తోందని తెలంగాణవాదులు అంటున్నారు. ఆజాద్ వ్యాఖ్యల పైన తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కేంద్రమంత్రి సుశీల్ కుమార్ పలుమార్లు 28లోగా తప్పకుండా తెలంగాణపై ప్రకటన ఉంటుందని చెప్పారని కానీ, ఆజాద్ వ్యాఖ్యలు సరిగా లేవంటున్నారు. తెలంగాణపై తాత్సారం చేయడం ద్వారా కాంగ్రెసు పార్టీ తన గోతి తానే తవ్వుకుంటోందనే అభిప్రాయాన్ని స్వయంగా తెలంగాణ కాంగ్రెసు ప్రజాప్రతినిధులే వ్యక్తం చేస్తున్నారు.
తెలంగాణకు అనుకూలంగా ప్రకటన వెలువడనున్నదనే ప్రచారం నేపథ్యంలో సీమాంధ్ర నేతలు మూకుమ్మడిగా న్యూఢిల్లీకి వెల్లారు. వారిని రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్ర రావు లీడ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. పెద్ద ఎత్తున సీమాంధ్ర ప్రజాప్రతినిధులు, మంత్రులు ఢిల్లీకి వెళ్లి అక్కడ అధిష్టానం పెద్దలను, కేంద్రం పెద్దలను భేటీ అవుతూ వరుసగా బిజీ అయ్యారు. పార్టీ అధిష్టానంపై వారు ఒత్తిడి తీసుకు వచ్చినట్లుగా భావిస్తున్నారు.
తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం ప్రకటిస్తే రాజీనామా చేస్తామని వారు హెచ్చరించి ఉంటారని అంటున్నారు. అదే సమయంలో దేశభద్రతకు తెలంగాణకు లింక్ పెట్టిన అంశాన్ని కూడా వారు అధిష్టానం, కేంద్రం దృష్టికి తీసుకు వెళ్లి కేంద్రంపై ఒత్తిడి పెంచినట్లుగా పలువురు భావిస్తున్నారు. రాజీనామా డిమాండ్లు, తెలంగాణ ఇస్తే ఇతర రాష్ట్రాల్లో ప్రత్యేకవాద డిమాండ్ల ఆందోళన నేపథ్యంలో కాంగ్రెసు వెనక్కి తగ్గినట్లుగా కనిపిస్తోందని అంటున్నారు.
ఆజాద్ ప్రకటనతో తెలంగాణవాదులు మండిపడుతున్నారు. కాంగ్రెసుకు ఇలా మోసం చేయడం మొదటి నుండి అలవాటే అంటున్నారు. కాంగ్రెసు పరిస్థితి ఇలాగే ఉంటే తెలంగాణలో ఆ పార్టీ కనుమరుగు కావడం ఖాయమంటున్నారు. ఆజాద్ వ్యాఖ్యలపై తెలంగాణవాదులు పెద్ద ఎత్తున నిరసనలు తెలిపేందుకు సిద్ధమవుతున్నారు. సోనియా గాంధీకి తెలిసే యు టర్న్ తీసుకొని ఉంటే తెలంగాణలో కాంగ్రెసు పార్టీ పని అయిపోయినట్లేనని అంటున్నారు.
ఆజాద్ వ్యాఖ్యలపై సోనియా స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. మరికొందరు తెలంగాణ నేతలు మాత్రం ఆజాద్ ప్రకటనను లెక్కలోకి తీసుకోకుండా సోనియా, షిండే ప్రకటన కోసం ఎదురు చూస్తున్నారు. ఆజాద్ వ్యాఖ్యలను నిరసిస్తూ తెలంగాణవాదులు కాగడా ప్రదర్శన నిర్వహించారు. పార్లమెంటులో బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ నేతల షాక్
మంద జగన్నాథం - షిండే దళితుడని, అందుకే ఆయన మాటకు విలువివ్వడం లేదా చెప్పాలి.
కెఎల్ఆర్ - ఆజాద్ వ్యాఖ్యలతో షాక్కు గురయ్యాం. కోలుకోలేకపోతున్నాం. భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తాం. తెలంగాణకు అడ్డుపడుతున్న వారిని వదలం.
మండవ వెంకటేశ్వర రావు - కేంద్రం పరిభాషలో నెల రోజులు అంటే 30 రోజులా 30 ఏళ్లా చెప్పాలి.
ముత్యం రెడ్డి - తెలంగాణకు అనుకూలంగా ప్రకటన చేయకుంటే పార్టీయే నష్ట పోతుంది. 28లోగా అనుకూలంగా ప్రకటన చేయాలి. లేదంటే మేం చేయాల్సింది చేస్తాం.
శ్రవణ్ కుమార్ - ప్రజల చితిమంటలతో కేంద్రం చలి కాచుకుంటోంది.
సీమాంధ్ర నేతల మాట
శైలజానాథ్ - ఇది తమ విజయంగా భావించడం లేదు. తెలంగాణ సున్నితమైన అంశం. తాము అధిష్టానాన్ని బెదిరించలేదు, భయపెట్టలేదు. తమ సమస్యను సావధానంగా విన్నవించాం.
ఆదినారాయణ రెడ్డి - కేంద్రం రాష్ట్రంలోని వాస్తవ పరిస్థితిని గుర్తించింది. సంతోషంగా ఉంది. డిల్లీ పర్యటన వంద శాతం విజయవంతమైంది. మేం చేసింది లాబీయింగ్ కాదు. సీమాంధ్ర ప్రజల అభిప్రాయం చెప్పాం.
గంటా శ్రీనివాస రావు - ఆజాద్ ప్రకటనను స్వాగతిస్తున్నాం. రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలని కోరాం.
డిఎల్ రవీంద్రా రెడ్డి - తెలంగాణ సున్నిత అంశం. నెలరోజుల్లో పరిష్కారం అయ్యే సమస్య కాదు. హైకమాండ్ ఉద్దేశ్యం విశ్లేషించే సామర్థ్యం లేదు.