తెలంగాణపై టైమిద్దాం, మమ్మల్ని అభినందిస్తారు: జానా
తెలంగాణ జఠిలమైన సమస్య అని, అందరూ సంయమనం పాటించాలని సూచించారు. కేంద్రం సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరించేందుకు ఆలోచిస్తోందన్నారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా నిర్ణయం త్వరలో వస్తుందన్నారు. సీమాంధ్ర ప్రాంత ప్రజాప్రతినిధులు తెలంగాణ ప్రజల ఆకాంక్షను అర్థం చేసుకోవాలన్నారు. తెలంగాణను వ్యతిరేకించే వారి ఆశలు నెరవేరవన్నారు. ప్రాంతాలుగా విడిపోయి తెలుగు ప్రజలుగా కలిసుందామన్నారు.
తెలంగాణపై కేంద్రం నుండి నిర్ణయం వచ్చే వరకు అందరూ సంయమనం పాటించాలన్నారు. ఇది సవాళ్లకు ప్రతి సవాళ్లకు సమయం కాదన్నారు. ప్రశాంత వాతావరణంలో రాష్ట్రం ఏర్పడుతుందన్నారు. ఈసారి కోస్తాంధ్ర నేతల ఒత్తిడి ఫలించదన్నారు. ప్రజలు ఆవేశాలకు లోనుకావొద్దన్నారు. సమైక్యవాదం ముసుగులో కొందరు వివిధ పార్టీలలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
జానా లౌక్యం!
మీడియా సమావేశంలో జానా రెడ్డి లౌక్యం ప్రదర్శించారు. అధిష్టానం కాస్త ఆలస్యమైనా తెలంగాణ ఇస్తుందన్న నమ్మకం ఉందని జానారెడ్డి చెప్పినప్పుడు మీకు మీరు డెడ్ లైన్ పెట్టుకున్నారా అని మీడియా ప్రతినిధులు ప్రశ్నించారు. అందుకు జానా.. తెలంగాణపై తమకు తాము డెడ్ లైన్ పెట్టుకోవాలని ఉందని, దానిని చెప్పాలని ఉందని కానీ, చెప్పమని అన్నారు. ప్రభుత్వాన్ని రక్షించుకుంటూనే తెలంగాణను సాధించుకుంటామని చెప్పారు.
తాము పదవుల కోసమే ఇలా మాట్లాడటం లేదని, మా ముందు ఇప్పుడు విపత్కర పరిస్థితులు ఉన్నాయని అన్నారు. తెలంగాణ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలా మాట్లాడుతున్నారనుకోవడం సరికాదన్నారు. అవసరమైన సమయంలో పదవులు వదులుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామన్నారు. అప్పటి వరకు ఓపికగా ఉంటామని అభిప్రాయపడ్డారు.
సీమాంధ్ర నేతలు చేసిన ప్రయత్నాలు ఫలిస్తుండగా తెలంగాణ నేతల ప్రయత్నాలు ఆ స్థాయిలో లేవనే విమర్శలు ఉన్నాయని అడగ్గా.. అధిష్టానాన్ని ఒప్పించలేక అని ప్రజలు, మీరు అంటారని తెలుసునని కానీ, మేం తెలంగాణ తీసుకు వచ్చి మమ్మల్ని మేం రుజువు చేసుకుంటామన్నారు. సాధించిన తర్వాత మమ్మల్ని మీరే అభిమానిస్తారన్నారు.