కెవిపి ఓ సైకో, జగన్ వైపే: విహెచ్, బొత్సపై పొన్నం ఫైర్
కాంగ్రెసులో ఉంటూనే కెవిపి రామచందర్ రావు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా పనిచేస్తున్నారని ఆయన విమర్శించారు. కాగ్రెసు నాయకులు వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వెళ్తుంటే కెవిపి ఎందుకు అడ్డుకోవడం లేదని ఆయన అడిగారు. మఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ పార్టీ బలోపేతంపై దృష్టి సారించాలని ఆయన సూచించారు. జగన్ కన్నా కెవిపియే ఎక్కువ డబ్బులు సంపాదించారని ఆయన ఆరోపించారు.
ఇదిలావుంటే, కాంగ్రెసు సీమాంధ్ర పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ రాజమండ్రిలో తలపెట్టిన జై ఆంధ్రప్రదేశ్ సభకు పిసిసి అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వెళ్లడానికి కాంగ్రెసు తెలంగాణ ప్రాంత పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, రాజయ్య తప్పు పట్టారు. పిసిసి చీఫ్గా ఉండి ఆ సభకు వెళ్లడాన్ని ఆయన వ్యతిరేకించారు. తాను వ్యక్తిగతంగా, ఉండవల్లి మిత్రునిగా మాత్రమే ఉండవల్లి ఆహ్వానం మేరకు సభకు వచ్చానని బొత్స సత్యనారాయణ అనడాన్ని వారు తప్పు పట్టారు.
ముఖ్యమంత్రికి, పిసిసి అధ్యక్షుడికి వ్యక్తిగతమంటూ ఉండదని వారు చెప్పారు. బొత్స సత్యనారాయణ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెసు పార్టీకి అధ్యక్షుడా, ఆంధ్ర కాంగ్రెసు పార్టీకి అధ్యక్షుడా అని ఆయన అడిగారు. తెలంగాణ సమావేశాలకు పిలిచినా బొత్స సత్యనారాయణ రాలేదని, ఇప్పుడు రాజమండ్రి సభకు వెళ్లడం సరి కాదని ఆయన హైదరాబాదులో మీడియా ప్రతినిధులతో అన్నారు.