తెలంగాణపై కేంద్రం ప్రకటన!: సస్పెన్స్కు తెరపడేనా?
మూడు రోజులుగా ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ కోర్ కమిటీ సభ్యులతో భేటీ అయి తెలంగాణపై చర్చించారు. ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిందేనని ఆమె కోర్ కమిటీలో అభిప్రాయపడ్డారు. సోనియా సూచన నేపథ్యంలో తెలంగాణపై కేంద్ర హోంమంత్రి సుశీల్ కుమార్ షిండే ఇచ్చిన గడువు 28లోగానే కేంద్రం ప్రకటన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి.
ఈ రోజు కాంగ్రెసు పార్టీ కోర్ కమిటీ సాయంత్రం ఐదు గంటలకు సమావేశం కానుంది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ నివాసంలో వారు భేటీ అవుతారు. భేటీ అనంతరం గులాం నబీ ఆజాద్ లేదా సుశీల్ కుమార్ షిండే తెలంగాణపై ఓ స్పష్టమైన ప్రకటన చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సాయంత్రం ఐదున్నర గంటల సమయంలో తెలంగాణపై ఆజాద్ స్వయంగా ప్రకటన చేయవచ్చునని అంటున్నారు.
అభివృద్ధి మండలా? ప్యాకేజా?
ఆజాద్ చేస్తారని భావిస్తున్న ప్రకటనపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆయన తెలంగాణ ప్రకటిస్తారా? లేక సమైక్యాంధ్ర అంటారా? అనే చర్చ రాష్ట్ర ప్రజల్లో ఉత్కంట రేపుతోంది. అయితే రెండు ప్రాంతాలను బ్యాలెన్స్ చేస్తూ ప్రకటన వెలువడే అవకాశముందని అంటున్నారు. ప్రకటన ప్రచారం నేపథ్యంలో అది శాశ్వతమా? లేక తాత్కాలికమా? అనే ప్రశ్న అందరి మెదళ్లను తొలిచివేస్తోంది. తాత్కాలికమే కావొచ్చునని అంటున్నారు.
తెలంగాణను ఇప్పటికిప్పుడు తేల్చలేమని, ఈ సమస్య పరిష్కారానికి మరికొంత సమయం కావాలని ఆజాద్ కోరే అవకాశముంది.
తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ లేదా మండలిని ఏర్పాటు చేయడం వంటివి ప్రకటించవచ్చునని చెబుతున్నారు. గూర్ఖాల్యాండ్ తరహా ప్యాకేజీ ప్రకటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా, యుటిగా తదితర ఆలోచనలు కేంద్రం మదిలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.