దిగొచ్చిన ప్రభుత్వం: ఎట్టకేలకు సమరదీక్షకు అనుమతి
ప్రజా యుద్ధ నౌక గద్దర్, శాసనమండలి సభ్యుడు చుక్కా రామయ్య హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డిని కలిసి సమర దీక్షకు అనుమతిపై చర్చించారు. వారి చర్చలు ఫలించాయి. సబిత సమర దీక్షకు అనుమతిని ఇచ్చారు. వినతి పత్రాన్ని సైబరాబాద్ కమిషనర్కు ఇవ్వాలని సూచించారు. రేపు సాయంత్రం వరకు శాంతియుతంగా సమర దీక్ష చేసుకోవచ్చని ఆమె తెలంగాణవాదులకు హితవు పలికారు.
ప్రభుత్వం దీక్షకు అనుమతించడంతో భారీగా తెలంగాణవాదులు సమర దీక్షా స్థలికి చేరుకుంటున్నారు. బిజెపి కార్యాలయం నుండి ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి, సీనియర్ నేత బండారు దత్తాత్రేయ, కార్యకర్తలు, తెలంగాణవాదులు, తెలంగాణ రాష్ట్ర సమితి, సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ తదితర తెలంగాణవాద పార్టీల కార్యకర్తలు, ఇతర తెలంగాణవాదులు వచ్చారు. సమర దీక్షకు హోంమంత్రి సబితా ఇంద్రా రెడ్డి సానుకూలంగా స్పందించారని చుక్కా రామయ్య అన్నారు. దీక్ష శాంతియుతంగా చేయాలని ఆయన కోరారు. కాగా దీక్షకు అనుమతిచ్చినప్పటికీ ఇందిరాపార్కు వెళ్తున్న కిషన్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కిరణ్ కుట్ర
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అడ్డుకుంటున్నారని పెద్దపల్లి పార్లమెంటు సభ్యుడు వివేక్ అన్నారు. ఉద్దేశ్యపూర్వకంగానే సమర దీక్షకు ప్రభుత్వం అనుమతిని ఇవ్వలేదని మండిపడ్డారు. తెలంగాణపై ప్రకటన రాకపోతే జనవరి 28వ తేదిన భవిష్యత్తు కార్యాచరణ ప్రకటిస్తామన్నారు.