షర్మిల రెడీ: ముందు జగన్ సంతకాలపై కృతజ్ఞత యాత్ర
షర్మిల యాత్ర కంటే మందు జగన్ విడుదల కోసం సేకరించిన దాదాపు రెండు కోట్ల సంతకాలున్న పత్రాలతో ఎల్లుండి నుండి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కృతజ్ఞతా యాత్రను ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది. ఈ యాత్ర 29న హైదరాబాద్లో ప్రారంభమై 30వ తేదిన కడప జిల్లా ఇడుపులపాయకు చేరుకుంటుంది. అక్కడ ఈ సంతకాల పత్రాలను పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ స్వీకరిస్తారు.
కాగా షర్మిల తన పాదయాత్రను ఫిబ్రవరి మొదటి వారంలో పునఃప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయాన్ని ఆమె వ్యక్తిగత ఫిజిషియన్ చెప్పారు. శనివారం ఆమెకు ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పరీక్షలు జరుగుతాయి. ఈ పరీక్షల తర్వాత షర్మిల పాదయాత్రపై ప్రకటన వెలువడే అవకాశం ఉంది.
మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర సందర్భంగా నిరుడు డిసెంబర్ 18వ తేదీన బస్సు ఎక్కుతున్న సమయంలో ఆమె కుడికాలికి దెబ్బ తగిలింది. ఆమె 3 వేల కిలోమీటర్లు నడిచేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. అయితే, కాలి నొప్పి కారణంగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు ఆమెకు సలహా ఇచ్చారు. దీంతో ఆమె మధ్యలో పాదయాత్ర ఆపాల్సి వచ్చింది. రాష్ట్ర విభజన వివాదం చెలరేగుతున్న ప్రస్తుత తరుణంలో ఆమె పాదయాత్రకు ప్రాధాన్యం ఉందని అంటున్నారు.
ఫిబ్రవరిలో పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తానని షర్మిల తమకు చెప్పినట్లు వైద్యుడు డాక్టర్ రఘువీర్ రెడ్డి చెప్పారు. ఇప్పటి వరకు ఆమె 3 వేల కిలోమీటర్లలో 82 2కిలోమీటర్ల పాదయాత్ర చేశారు. వైయస్ జగన్ జైలుకు వెళ్లడంతో నిరుడు అక్టోబర్ నుంచి ఆమె వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో చురుకైన పాత్ర నిర్వహిస్తున్నారు.
ఆమె నడకను సాధన చేస్తున్నారని, క్రష్ లేకుండా నడవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారని అంటున్నారు. నిజానికి పూర్తిగా కోలుకోవడానికి కనీసం రెండున్నర నెలలు పడుతుందని, షర్మిల అత్మస్థయిర్యం కారణంగా త్వరగా కోలుకున్నారని డాక్టర్ రెడ్డి అంటున్నారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలో నెలన్నర క్రితం ఆమె పాదయాత్ర నిలిచిపోయింది.