అవినీతితో దళితులు, ఓబిసిలకు లింక్ పెట్టిన ఆశిష్నంది
ఆయన వ్యాఖ్యలపై దళిత, ఓబిసి వర్గాలు మండిపడ్డాయి. రాజకీయ పార్టీల నుంచి పోలీసుల వరకు తీవ్రంగా స్పందించారు. కొన్ని సంస్థల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆశీష్పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అయితే, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని ఆశీష్ వివరణ ఇచ్చారు. అపార్థానికి తావిచ్చేవిధంగా తన వ్యాఖ్యలంటే క్షమించాలన్నారు. కాగా అంతకుముందు రోజు శుక్రవారం తెలుగు రచయిత ఐలయ్య, బాలీవుడ్ గీత రచయిత జావెద్ అక్తర్ల మధ్య వాడీవేడిగా మాటల యుద్ధం కొనసాగింది.
ఆశీష్ నంది వ్యవహారం వేడి రగిలించింది. అవినీతిలో విశేషభాగం ఓబీసీలు, ఎస్సీల వల్లే జరుగుతోందని, ఇప్పుడిప్పుడే ఎస్టీలూ చేరుతున్నారని ఆశిష్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై సదస్సులోనే తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. ప్రధాన పార్టీలు వెనువెంటనే ఖండించాయి. ఆశిష్ నందిని తక్షణం అరెస్టు చేయాలని బీఎస్పీ అధినేత్రి, ఉత్తర ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతి డిమాడ్ చేశారు.
ఆశిష్ నుంచి సంజాయిషీ అడగాలని సదస్సు నిర్వాహకులను కోరారు. అలాంటి వ్యాఖ్యలను సమ్మతించరని కాంగ్రెస్ ప్రతినిధి రషీద్ అల్వీ పేర్కొన్నారు. ఆశిష్ వంటి వారు అలా మాట్లాడటం భావ్యం కాదని బిజెపి నాయకురాలు నజ్మా హెప్తుల్లా అన్నారు. ఆశిష్ వ్యాఖ్యలకు ఆధారమేమిటని ప్రముఖ దళిత రచయిత చంద్రభాన్ ప్రసాద్ ప్రశ్నించారు. ఓబిసిలు, దళితులు, ఆదివాసీలే ఎక్కువ అవినీతిపరులని నిర్ధారించే అధ్యయనంగానీ సమాచారం గానీ ఏమైనా ఉందా అని, అటువంటిదేమీ లేనప్పుడు, అలా మాట్లాడకూడదన్నారు.
సదస్సులో తాను ఎలాంటి అభ్యంతర వ్యాఖ్యలు చేయలేదని ఆశిష్ నంది వివరణ ఇచ్చారు. సమాజంలోని అన్ని వర్గాలు అవినీతికి పాల్పడుతున్నాయని, కాకపోతే, ధనికులు, సంపన్నుల అవినీతి పెద్దగా కనిపించడం లేదన్నారు. అదే దళితులు, ఆదివాసీలు, పేదలు అదే పనిచేస్తే ఎక్కువగా బయటకు కనిపిస్తూ ఉంటుందని మాత్రమే తాను అన్నానని చెప్పారు.