ఇంకో దేశంలో ఐతే, నోరు ఎలా?: కెసిఆర్కు బొత్సకౌంటర్

మన దేశాన్ని, మన ప్రధానమంత్రిని మనం గౌరవించుకోవాల్సిన అవసరముందన్నారు. ప్రధానిని చప్రాసీతో పోల్చడం సరికాదన్నారు. కెసిఆర్ వ్యాఖ్యలను తాను ఖండిస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్య దేశమా అని ప్రశ్నించడమేమిటన్నారు. ఇలాంటి కించపర్చే వ్యాఖ్యలు సరికాదన్నారు. త్యాగమూర్తి అయిన తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీపై ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడటమేమిటన్నారు.
దేశం కోసం ప్రాణాలు అర్పించిన దివంగత ప్రధాని ఇందిరా గాంధీని 360 మంది ప్రాణత్యాగాలకు కారణంగా చెప్పడం సమంజసం కాదన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఎలా ఏర్పడిందో అందరికీ తెలుసునన్నారు. ఆ రోజు అందరు కలిసి ఓ రాష్ట్రంగా ఏర్పడాలనుకున్నారని చెప్పారు. నాటి రాష్ట్రం ఏ ఒక్క పార్టీ రాజకీయ లబ్ధి కోసమో, ఏ ఒక్క వ్యక్తి కోసమే ఏర్పడలేదన్నారు. ధర్నాలు, ఆందోళనలు, ప్రజల అభిప్రాయం చెప్పడంలో తప్పులేదని కానీ, మాట్లాడే తీరు బాగుండాలన్నారు.
ప్రజాస్వామ్య దేశమా అని కెసిఆర్ ప్రశ్నించారని, ఆ స్వాతంత్ర్యం ఉండటం వల్లనే ప్రధానిని చప్రాసీతో పోల్చారనే విషయాన్ని గుర్తించాలన్నారు. సోనియా కుటుంబం పైన కెసిఆర్ తన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ సమస్య పరిష్కారానికి కాంగ్రెసు పార్టీ చిత్తశుద్ధితో ఉందన్నారు. కెసిఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరితో పొత్తు పెట్టుకుంటారనే అంశం తమకు సంబంధం లేదని, తెలంగాణ, సమైక్య ఉద్యమాల పట్ల మాత్రం బాధ్యత తమ ప్రభుత్వాలదే అన్నారు.
కాంగ్రెసు అధికారం కోసం కాకుండా దేశ సార్వభౌమాధికారం కోసం పని చేస్తోందన్నారు. ఇందిర, సోనియాలను అనేందుకు కెసిఆర్కు నోరు ఎలా వచ్చిందని ప్రశ్నించారు. తెలంగాణపై సంప్రదింపులు జరుగుతున్నాయని చెప్పారు. ఇప్పటికే పది పదిహేను సమావేశాలు జరిగాయన్నారు. దిక్కుమాలిన దేశం అని మన దేశాన్ని మనం కించపర్చుకుంటామా అన్నారు. రాజమండ్రి పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ఏర్పాటు చేసిన సభ సమైక్య సభ కాదన్నారు.
వాక్స్వాతంత్రం ఉందని మన దేశాన్ని మనం, మన ప్రధానిని మనం అవమానించవద్దన్నారు. కెసిఆర్ చెప్పినట్లు వింటే సోనియా దేవత అవుతుంది. లేకుంటే ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడతారా అని ప్రశ్నించారు. తెలంగాణఫై షిండే నెల రోజులు చెప్పింది నిజమేనని అయితే ఇలాంటి సున్నిత అంశం పైన నెల అంటే నెలనే అనుకోవద్దని, కొన్ని రోజులు అటు ఇటు కావోచ్చుననే విషయం అందరూ గుర్తించాలన్నారు. నెహ్రూ గారి ఆధ్వర్యంలోనే ఎపి ఏర్పాటయిందన్నారు.
1997లో ఒక వోటు రెండు రాష్ట్రాలు అన్ని బిజెపి అధికారంలోకి వచ్చాక తెలంగాణను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. మోసం చేసింది ఎన్డీయేనా లేక కాంగ్రెస్సా చెప్పాలని కెసిఆర్ను బొత్స ప్రశ్నించారు. కెసిఆర్ తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ఉద్యమాలపై కాంగ్రెసు పార్టీ అధ్యయనం చేస్తోందన్నారు. ఎంత ఆగ్రహం వచ్చినా సంయమనంతో మాట్లాడాలని సూచించారు.












Click it and Unblock the Notifications