ఫలించిన చంద్రబాబు వ్యాహం: కెసిఆర్తో కాంగ్రెసు ఫైట్
తెలుగుదేశంలో ఇరు ప్రాంతాల మధ్య వైరం సద్దుమణిగి కాంగ్రెసు పార్టీకి పెద్ద యెత్తున తాకింది. ఇరు ప్రాంతాల నాయకులు ప్రాంతాలవారీగా చీలిపోయి పరస్పరం విమర్శలు చేసుకుంటున్నారు. దాంతో కాంగ్రెసు అధిష్టానం తెలంగాణపై నిర్ణయం తీసుకోలోని చిక్కుల్లో పడిపోయింది. దీంతో కాంగ్రెసుపై తన విమర్శలను ఎక్కుపెట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. తెలుగుదేశం పార్టీ తెలంగాణ నాయకులు ఇంత కాలం కెసిఆర్పై తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు. ఎర్రబెల్లి దయాకర్ రావు, మోత్కుపల్లి నర్సింహులు, నామా నాగేశ్వర రావు, కడియం శ్రీహరి వంటి తెలంగాణ తెలుగుదేశం నేతలు తెరాసపై ఎదురుదాడి చేయాల్సి వచ్చింది.
తెలంగాణ జెఎసి నిర్వహించిన తెలంగాణ సమరభేరీలో కెసిఆర్ కాంగ్రెసుపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ మంత్రులపైనే కాకుండా సోనియా గాంధీపై, మన్మోహన్ సింగ్పై ఆయన తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. దీంతో ఒక్కసారిగా యుద్ధం నుంచి తెలుగుదేశం పార్టీ పక్కకు వెళ్లి కాంగ్రెసు రంగం మీదికి వచ్చింది. కెసిఆర్పై కాంగ్రెసు సీమాంధ్ర నాయకులే కాకుండా తెలంగాణ నాయకులు కూడా తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్పై పోలీసులకు ఫిర్యాదులు కూడా చేస్తున్నారు.
విజయవాడలో కాంగ్రెసు మాజీ శాసనసభ్యుడు అడుసమిల్లి జయప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాదులోని గాంధీనగర్ పోలీసులకు కాంగ్రెసు శానససభ్యుడు తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి ఫిర్యాదు చేశారు. ఈ సమయంలో జగ్గారెడ్డిని అడ్డుకునేందుకు తెరాస కార్యకర్తలు ప్రయత్నం చేశారు. తెరాస కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కెసిఆర్పై కేసుల విషయంలో కఠినంగానే వ్యవహరించాలని ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి భావిస్తున్నట్లు ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది.
కాగా, తెలంగాణ మంత్రులపై కెసిఆర్ చేసిన వ్యాఖ్యలు కూడా తీవ్ర పరిణామానికి దారి తీశాయి. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ మంత్రులతో సమాలోచనలు జరిపి, ఆ తర్వాత మీడియా సమావేశంలో వారితో కలిసి కెసిఆర్పై తీవ్రంగా ధ్వజమెత్తారు. కెసిఆర్ స్థాయిని, ఆయన పార్టీ స్థాయిని ఆయన ప్రశ్నించారు.
మరోవైపు, ఇంత కాలం కెసిఆర్కు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అనుకున్న కాంగ్రెసు పార్లమెంటు సభ్యులు కూడా ప్లేటు ఫిరాయించినట్లు కనిపిస్తున్నారు. కాంగ్రెసు నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు మధు యాష్కీ - కెసిఆర్పై తీవ్రంగా విరుచుకుపడ్డారు. మొత్తం మీద, కెసిఆర్ వ్యవహారాన్ని పరిష్కరించుకోవడంలో చంద్రబాబు విజయం సాధించినట్లే చెప్పాలి. కాంగ్రెసుపైకి తెలంగాణ సమరాన్ని గురి పెట్టాలనే ఆయన వ్యూహం ఫలించిందని చెప్పాలి.