జగన్ను కల్సిన మాజీలు: గాలితో హీరో సాయి కుమార్
కాగా వైయస్ జగన్మోహన్ రెడ్డి జైలుకు వెళ్లిన తర్వాత కొంతకాలం వైయస్సార్ కాంగ్రెసు పార్టీలోకి వలసలు ఆగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జగన్ పార్టీలోకి తెలుగుదేశం, కాంగ్రెసు పార్టీల నుండే కాకుండా తెలంగాణ ప్రాంతంలో ప్రధానంగా ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి నుండి కూడా వలసలు ప్రారంభమయ్యాయి. సీమాంధ్రలో టిడిపి, కాంగ్రెసును వణికించిన జగన్ తెలంగాణలో తెరాస అధినేత కె చంద్రశేఖర రావుకు ఓ సమయంలో ముచ్చెమటలు పట్టించారు.
అయితే అఖిల పక్ష సమావేశం తర్వాత తీరు మారింది. తెలంగాణలో వలసలు ఆగిపోవడమే కాకుండా వైయస్సార్ కాంగ్రెసు పార్టీలో ఉన్న నేతలు కూడా ఎక్కువగా మాట్లాడటం లేదు. అందుకు జగన్ పార్టీ అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూలంగా నిర్ణయం తీసుకోకుండా కేంద్రంపై భారం వేయడమే! అఖిల పక్ష సమావేశం అనంతరం తెలంగాణలో తెరాస, టిడిపిలు పుంజుకున్నాయనే చెప్పవచ్చు.
అయితే సీమాంధ్రలో మాత్రం జగన్ ప్రభావం కనిపిస్తూనే ఉంది. టిడిపి, కాంగ్రెసు పార్టీలకు చెందిన నేతలు సమయం, సందర్భాన్ని బట్టి ఆ పార్టీలను వీడుతున్నారు. ప్రస్తుతానికి పలువురు మాజీ నేతలు జగన్ పార్టీ వైపు ఆకర్షితులవుతున్నారు. ఎన్నికలకు ముందు ప్రజాప్రతినిధులు కూడా జాయిన్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
జైల్లో గాలిని కలిసిన సాయికుమార్
ఓఎంసి కేసులో అరెస్టై జైలులో ఉన్న గాలి జనార్ధన్ రెడ్డిని ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ ఈ రోజు కలిశారు. కర్నాటకలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై చర్చించారు. గత ఎన్నికల్లో కర్నాటకలోని బాగేపల్లి నియోజకవర్గం నుండి పోటీ చేసి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయానని, వచ్చే ఎన్నికల్లో అదే నియోజకవర్గం నుండి పోటీ చేస్తానని చెప్పారు. ఏ పార్టీలో అనేది త్వరలో చెబుతానన్నారు.