నోటికి హద్దూ పద్దూ లేదు: కెసిఆర్పై జగ్గారెడ్డి ఫైర్

మంత్రి పదవి రాకపోవడం వల్లనే కెసిఆర్ తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడని ఆయన అన్నారు. ప్రతి ఒక్కరినీ విమర్శించే నైతిక హక్కు కెసిఆర్కు లేదని అన్నారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు చిన్న రాష్ట్రాలు అవసరం లేదని కెసిఆర్ అన్నట్లు ఆయన తెలిపారు. తెలుగుదేశం పార్టీ మంత్రి పదవి రాకపోడంతో బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నాడని, తెలంగాణ ప్రజల మనోభావాలను అడ్డం పెట్టుకుని రాజకీయంగా బతుకుతున్నాడని ఆయన కెసిఆర్పై మండిపడ్డారు.
"రాజకీయంగా నీ బాధలు నువ్వు పడు, ఇతరులను దూషించడం రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నావు. ఇతరులను రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చారు" అని జగ్గారెడ్డి కెసిఆర్ను ప్రశ్నించారు. కాంగ్రెసును విమర్శించే నైతిక హక్కు కెసిఆర్కు లేదని అన్నారు. ఎవరినీ పడితే వారిని నోటికి వచ్చినట్లు దూషించడం మంచిది కాదని, దాన్ని తెలంగాణ ప్రజలు స్వాగతించరని ఆయన అన్నారు. మన ప్రాంత నాయకులను మనమే అగౌరవపరుచుకుంటున్నామని అన్నారు.
కెసిఆర్ అలా చేస్తే తెలంగాణ ఎలా సాధ్యమవుతుందని ఆయన అడిగారు. కాంగ్రెసు తెలంగాణను ఇచ్చే అవకాశం ఉందని, అందుకు ప్రయత్నం జరుగుతోందని, మంచితనంతో కాంగ్రెసు అధిష్టానాన్ని ఒప్పించి తెలంగాణ సాధించుకోవాలని ఆయన అన్నారు. అలాంటి ప్రయత్నాలు చేస్తున్న తమ కాంగ్రెసు పార్టీ మంత్రులను, శాసనసభ్యులను, పార్లమెంటు సభ్యులను కెసిఆర్ దొంగలంటున్నారని, అటువంటప్పుడు తెలంగాణ సాధ్యం కాదని ఆయన అన్నారు.
తెరాస బలహీనపడుతోందని, ఆ భయం కెసిఆర్కు పట్టుకుందని, అందుకే దిగజారి మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పాటు కన్నా రాజకీయంగా ఆధిపత్యం చెలాయించడమే కెసిఆర్కు కావాలని, 2004లోనూ 2009లోనూ ఆ ప్రయత్నాలే వ్యూహాత్మకంగా చేశాడని, వచ్చే ఎన్నికలకు కూడా అదే వ్యూహంతో కెసిఆర్ ముందుకు పోవాలనుకుంటున్నారని ఆయన అన్నారు. తెలంగాణ కావాలంటే తమ పార్టీ మంత్రులను, శానససభ్యులను, పార్లమెంటు సభ్యులను ముందు పెట్టి ఢిల్లీలో కెసిఆర్ ప్రయత్నాలు చేయాలని ఆయన అన్నారు. మోసపూరిత మాటలతో కెసిఆర్ గారడీ చేస్తున్నారని, కెసిఆర్ గానీ ఆయన కుటుంబ సభ్యులు గానీ తెలంగాణ సాధించాలని పనిచేయడం లేదని జగ్గారెడ్డి అన్నారు.
తాను రాజీనామా చేయబోనని, రాజీనామాలతో తెలంగాణ రాదని ఆయన అన్నారు. దేశాన్ని, ప్రధానిని అవమానించే విధంగా వ్యాఖ్యలు చేసిన కెసిఆర్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. దేశ ప్రజలకు కెసిఆర్ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. అక్బరుద్దీన్పై పెట్టినట్లుగానే కెసిఆర్పై కేసు పెట్టాలని ఆయన అన్నారు. ప్రభుత్వం కేసు నమోదు చేయకపోతే తాను పెడతానని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications