నో రిజైన్స్: కెకె, కెసిఆర్కి యాష్కీ సవాల్, తగ్గటం వెనుక
రేపు ఢిల్లీ వెళ్తున్నామని, రాజీనామాలతో తాము వెళ్తున్నామని అన్నారు. పార్టీ అధిష్టానం నుండి తెలంగాణకు అనుకూలంగా ఎలాంటి సంకేతాలు రాకుంటే తమ రాజీనామాలను పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకే నేరుగా ఇస్తామని చెప్పారు. వస్తే మాత్రం రాజీనామాలు చేయకుండా మరికొంత కాలం ఆగుతామని చెప్పారు. తెలంగాణ ఇచ్చినా ఇవ్వకున్నా కాంగ్రెసు పార్టీదే బాధ్యత అన్నారు. అధికారంలో ఉండి మాట ఇచ్చాం కాబట్టి ఆ మాటను నిలబెట్టుకోవాల్సిందే అన్నారు.
తెలంగాణ తేవాల్సిన బాధ్యత తమ భుజస్కందాల పైన ఉందన్నారు. అధిష్టానంపైన ఒత్తిడి తీసుకు వచ్చి తెలంగాణ తెస్తామన్నారు. ఎఫ్డిఐల సమయంలో ఒత్తిడి తీసుకు వచ్చి అఖిల పక్ష సమావేశం పెట్టించామన్నారు. నెల రోజుల గడువును తాము అడగలేదని, హోంశాఖే చెప్పిందన్నారు. కాబట్టి కేంద్రం తప్పకుండా సాధ్యమైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్నారు. గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలు తమను బాధించాయని చెప్పారు. అందుకే రాజీనామాలు చేయాలని నిర్ణయించుకున్నామన్నారు.
తమ రాజీనామాల డ్రామా కాదని అన్నారు. తెలంగాణపై చిత్తశుద్ధితో ఉన్నామని చెప్పారు. టిజి వెంకటేష్, దానం నాగేందర్ వంటి నేతలు తెలంగాణపై సంకేతాలు ఉన్నాయని చెప్పడంతో డిసెంబర్ 9 కంటే ఎక్కువ ప్రత్యేకవాదం ప్రజల్లోకి వెళ్లిందన్నారు. తెలంగాణ ఉద్యమ బాధ్యత మాదే అన్నారు. హైదరాబాదుతో కూడిన తెలంగాణ తప్ప తమకు ఏదీ వద్దన్నారు. తెలంగాణ సాధనే మా లక్ష్యమన్నారు. వెయ్యి మంది ప్రాణాలు అర్పించారని, తెలంగాణ వారి ఆకాంక్షను నెరవేర్చుతామన్నారు.
తెలంగాణ యాభై ఏళ్ల ఆకాంక్ష అన్నారు. అధిష్టానాన్ని, ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడం తమ లక్ష్యం కాదన్నారు. తెలంగాణ కోసం మంత్రులు ఎలా ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తే అలా వెళతామన్నారు. కాంగ్రెసు పార్టీ పైన నమ్మకం లేకున్నా ఉండి పోరాడుతామన్నారు. తెలంగాణపై తాము వెనక్కి తగ్గేది లేదన్నారు. రాజీనామాలతోనే తాము ఢిల్లీకి వెళుతున్నామన్నారు.
కెసిఆర్కు యాష్కీ సవాల్
తాము ఇక నుండి ప్రజా యుద్ధ నౌక గద్దర్తో కలిసి తెలంగాణ కోసం పని చేస్తామని మధుయాష్కీ అన్నారు. తాము కెసిఆర్తో కలిసి పని చేయమని చెప్పారు. ఇక ఉద్యమం మాదే అన్నారు. హైదరాబాద్ సహా తెలంగాణ ఇస్తే కెసిఆర్ ముఖ్యమంత్రి పదవి, సీట్లు అడగకుండా భేషరతుగా కాంగ్రెసులో తెరాసను విలీనం చేస్తారా అని సవాల్ చేశారు. షిండే, ఆజాద్లపై సోనియాకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఆజాద్ ప్రకటన ఆయన సొంత అభిప్రాయమన్నారు.
రాజీనామాపై వెనక్కి తగ్గటం వెనుక
ఎంపీలు రాజీనామాలపై వెనక్కి తగ్గటం వెనుక పలు కారణాలు ఉన్నాయని తెలుస్తోంది. రాజీనామాలపై ఎంపీల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం, రాజీనామాలు చేస్తే రాజకీయంగా ఓ వేదిక ఉండదని, అప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయని, కెసిఆర్ను ధీటుగా ఎదుర్కోవాలంటే పార్టీలో ఉండి పోరాడటమే మంచిదని, పార్టీతో తెగతెంపులు చేసుకుంటే అధిష్టానం పైన ఒత్తిడి తెచ్చే అవకాశం ఉండదని ఇలా పలు కారణాలతో వారు రాజీనామాలపై తగ్గినట్లుగా తెలుస్తోంది.