తెలంగాణ ద్రోహి, దుర్మార్గుల్లో ఫస్ట్: కెసిఆర్పై ఉండవల్లి

తెలంగాణ, సీమాంధ్ర నేతలు కూర్చుని మాట్లాడుకునే వాతావరణాన్ని కూడా కెసిఆర్ దెబ్బ తీస్తున్నారని ఆయన మండిపడ్డారు. కెసిఆర్ నాయకత్వంలోని తెలంగాణ ఎప్పటికీ రాదని ఆయన అన్నారు. తెలంగాణకు తమ పార్టీ వ్యతిరేకం కాదని ఆయన అన్నారు. భారత ప్రజలు కోరుకుంటే దేశానికి స్వాతంత్ర్యం రాలేదని, బ్రిటిష్ పార్లమెంటులో తీర్మానం జరిగిందని, చర్చలు జరిగాయని ఆయన అన్నారు. తెలంగాణ ఏర్పడాలంటే దేశమంతా అంగీకరించాలని ఆయన అన్నారు. దేశాన్ని, ప్రధానిని కించపరిచే విధంగా కెసిఆర్ మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు.
సమస్యను పరిష్కరించుకోవడం కెసిఆర్కు ఇష్టం లేదని, కాంగ్రెసును అవమానించారని, సోనియాను విమర్శిస్తే ప్రతి కాంగ్రెసు వ్యక్తినీ విమర్శించినట్లేనని, ఉద్రిక్తతలు రెచ్చగొట్టడానికే కెసిఆర్ మాట్లాడారని ఉండవల్లి అన్నారు. పార్లమెంటు సభ్యులు, శానససభ్యులు రాజీనామాలు చేస్తే తెలంగాణపై మాట్లాడడానికి ఎవరూ ఉండకూడదని కెసిఆర్ అనుకుంటున్నారని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యులు రాజీనామా చేస్తే పార్లమెంటులో మాట్లాడేదెవరని ఆయన అడిగారు. తాను వ్యక్తిగతంగా రాజీనామాలకు వ్యతిరేకమని ఆయన అన్నారు.
చర్చల ద్వారా తెలంగాణ సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. జలాలపై, రాజధానిపై, ఉద్యోగాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. చిన్న రాష్ట్రాలను కోరుకునే తన వంటివారిని కూడా వ్యతిరేకం చేసుకునే విధంగా కెసిఆర్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. రాజకీయ స్వార్థం కోసం ఆంధ్రప్రదేశ్ ఏర్పడలేదని ఆయన అన్నారు. తెలంగాణను కోరుకునే చట్టబద్ధమైన హక్కు కెసిఆర్కు ఉందని, అయితే, ఉద్రిక్తతలు రెచ్చగొట్టే విధంగా, దేశాన్ని విచ్ఛిన్నం చేసే విధంగా మాట్లాడడం సరి కాదని ఆయన అన్నారు. ఇరు ప్రాంతాల నాయకుల మధ్య విద్వేషాలు, అనుమానాలు తలెత్తే విధంగా కెసిఆర్ మాట్లాడుతున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ ప్రజాద్రోహం చేస్తున్నాడని ఆయన అన్నారు.
కాంగ్రెసును, తెలుగుదేశం పార్టీలను, అన్ని రాజకీయ పార్టీలను తిట్టిపోయడం ద్వారా వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు గెలుచుకోవాలని రాజకీయ ప్రయోజనం కోసం కెసిఆర్ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబు స్థాయి కన్నా కెసిఆర్ స్థాయి తక్కువ అని, అందుకే చంద్రబాబుపై కెసిఆర్ విమర్శలు చేస్తున్నారని ఆయన అన్నారు. కెసిఆర్ మాటలను ప్రజలు నమ్మడం లేదని ఆయన అన్నారు. కెసిఆర్ తప్పు దోవలో పోతున్నారని ఆయన అన్నారు. దేశం కోసం తాము తల తెగ్గొట్టుకోవడానికైనా సిద్ధంగా ఉన్నామని ఆయన చెప్పారు. చర్చలకు తాము ముందుకు వస్తామని, కెసిఆర్ కూడా ముందుకు రావాలని ఆయన అన్నారు. రండి, కూర్చుని మాట్లాడుకుందామని ఆయన అడిగారు. హైదరాబాదు చరిత్రలో దుర్మార్గులు చాలా మంది ఉన్నారని, కెసిఆర్ వారిలో నెంబర్ వన్ స్థానం అక్రమిస్తారని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications