మనసు గాయపడింది!: పొన్నం 'పెద్దాపురం వేశ్య'పై ఫైర్
పొన్నం మహిళల మనోభావాలను కించపర్చారని ఆరోపిస్తూ వారు విశాఖపట్నంలోని మూడో పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పొన్నం తన వ్యాఖ్యలను వెంటనే విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఆ వ్యాఖ్యలు అన్నప్పుడే తాము విత్ డ్రా చేసుకోవాలని కోరామని, ఇప్పటి వరకు స్పందన లేదన్నారు. అందుకే తాము పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు.
మహిళల మనోభావాలు కించపర్చేలా పెద్దాపురం వేశ్య అన్న పొన్నం పైన ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర మహిళలకు పొన్నం క్షమాపణలు చెప్పాలన్నారు. ఓ బాధ్యాతాయుతమైన పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఇలాంటి కుసంస్కార వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలన్నారు. వేశ్యా వృత్తి అనేది ఒక సాంఘీక దురాచారమని వారు అన్నారు.
ప్రభుత్వం ఆ పదాలను కూడా ఎప్పుడో మార్చి వేసిందని గుర్తు చేశారు. తెలంగాణ కావాలంటే వారు తెచ్చుకోవచ్చునని అందుకు, తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కానీ, పెద్దాపురం వేశ్య అంటూ మహిళలను కించపర్చేలా మాట్లాడటం మాత్రం సరికాదన్నారు. ఆయన క్షమాపణలు చెప్పే వరకు ఊరుకోమన్నారు.
పొన్నం రాజకీయ వ్యభిచారి
పొన్నం ప్రభాకర్ రాజకీయ వ్యభిచారి అని ఎమ్మెల్యే గాంధీ మోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళలను కించపర్చేలా మాట్లాడిన ఆయనపై కేసు పెడతామన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ నడిచిన ప్రదేశంపై ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా..
చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో సమైక్యాంధ్రకు మద్దతుగా ఐకాస పిలుపు మేరకు విద్యాసంస్థలు స్వచ్చంధంగా బందును పాటిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో విద్యార్థులు రోడ్ల పైకి వచ్చి సమైక్యాంధ్రకు అనుకూలంగా నినాదాలు చేశారు. భారీ ర్యాలీలు చేపట్టారు. కేంద్రం సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.