మౌనం వీడిన షారూక్ ఖాన్: సేఫ్గా లేనని రాశానా

సంకుచిత బుద్ధి గలవారి వల్ల ముస్లిం కళాకారులు ఎలా ఇబ్బందులు పడుతున్నారో మాత్రమే చెప్పానని, అదే మరోసారి జరిగిందని ఆయన అన్నారు. ముంబైలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. తన ఆర్టికల్ను తప్పుగా ఉటంకించి మాట్లాడుతున్నారని అన్నారు. షారూక్ ఖాన్ భద్రత అనేది వివాదంగా మారి, పాకిస్తాన్, భారతదేశం మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. ఈ స్థితిలో షారూక్ ఖాన్ మౌనం వీడారు.
భారతదేశంలో తాను అభద్రతకు గురవుతున్నట్లు తాను ఎప్పుడూ చెప్పలేదని స్పష్టం చేశారు. తనకు అనవసరమైన సలహాలు ఇవ్వవద్దని, భారతదేశంలో తాము సురక్షితంగా ఉన్నామని షారూక్ అన్నారు. బీయింగ్ ఏ ఖాన్ అనే శీర్షికతో షారూక్ రాసిన వ్యాసం వివాదంగా మారింది. భారతదేశంలో తాను సురక్షితంగా, ఆనందంగా ఉన్నానని ఆయన చెప్పారు. తమకు అద్భుతమైన ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ, లౌకిక జీవన విధానం ఉన్నాయని ఆయన అన్నారు.
వివాదానికి ప్రాతిపదిక ఏమిటో తనకు అర్థం కాలేదని, తాను భారత ముస్లిం చలనచిత్ర నటుడిని కావడం వల్ల కొన్ని సంకుచిత శక్తులు స్వల్ప ప్రయోజనాల కోసం మత సిద్ధాంతాలను వాడుకుంటున్నాయని తాను చెప్పానని ఆయన అన్నారు. మత, సాంస్కృతిక హద్దులు దాటి ప్రజలు తనపై ప్రేమ వర్షం కురిపిస్తున్నారని ఉద్వేగానికి గురైన షారూక్ అన్నారు. భారతీయుడిని అయినందుకు తాను గర్విస్తున్నట్లు తెలిపారు.
మనదే మతమని తన పిల్లలు అడిగినప్పుడు మొదట మనం భారతీయులమని, మన మతం మానవత్వమని చెబుతానని అన్నారు. జాతీయ ప్రయోజానాలకు, మతానికి సంబంధించిన విషయాలపై సంచలనాలు సృష్టించవద్దని ఆయన మీడియాను కోరారు. షారూక్కు తగిన భద్రత కల్పించాలని పాకిస్తాన్ అంతర్గత వ్యవహారాల మంత్రి మాలిక్ చేసిన వ్యాఖ్యలకు ఆయన తీవ్రంగా ప్రతిస్పందించారు. భారత్ సురక్షితమైన, లౌకిక విలువలకు కట్టుబడి దేశమని అన్నారు.












Click it and Unblock the Notifications