మార్చి 20న చలో అసెంబ్లీ: ఒయు జెఎసి నిర్ణయం
ఫిబ్రవరి 15న తెలంగాణ వ్యాప్తంగా సైకిల్ యాత్రలు, మార్చి 2న తెలంగాణ విద్యార్థి సింహగర్జన, మార్చి 20న చోల అసెంబ్లీ ముట్టడికి ఓయూ జేఏసీ పిలపునిచ్చింది. అలాగే ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎన్నికల్లో ఓయూ జేఏసీ నుంచి అభ్యర్థిని నిలబెడతామని జేఏసీ నేతలు తెలిపారు.
ఇదిలా వుంటే, చలో హైదరాబాద్, జాతీయ రహదారుల దిగ్బంధంఫై కార్యాచరణను రేపటి ఆదివారం సమావేశంలో నిర్ణయం తీసుకుంటామని తెలంగాణ రాజకీయ జెఎసి చైర్మన్ కోదండరామ్ చెప్పారు. తెలంగాణపై కాంగ్రెసు తెలంగాణ నేతలు తమకు తామే గడువును పొడగించుకుంటున్నారని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో వ్యాఖ్యానించారు. ప్రజలకు విశ్వాసం కల్పించే విధంగా కాంగ్రెసు తెలంగాణ ప్రాంత నాయకులు వ్యవహరించాల్సి ఉందని ఆయన అన్నారు.
కాగా, మాజీ మంత్రి పి. శంకరరావు అరెస్టును కోదండరామ్ ఖండించారు. కక్ష కట్టి శంకరరావును అరెస్టు చేయాలని ప్రభుత్వం చూస్తోందని ఆయన విమర్శించారు. ఆరోపణలు ఎదుర్కుంటున్న మంత్రులను కాపాడుతున్న ప్రభుత్వం శంకరరావుపై మాత్రం కక్షతో వ్యవహరిస్తోందని ఆయన అన్నారు.