'సిఎం ఢిల్లీ వెళ్తున్నారని..': తెలంగాణ కోసం ఆత్మహత్య
గాయాలు పెద్దవి కావడంతో పరిస్థితి విషమించి సోమవారం రాత్రి చికిత్స పొందుతూ భరద్వాజ్ తుది శ్వాస విడిచాడు. తన ఆత్మ బలిదానంతోనైనా కాంగ్రెసు పార్టీకి కనువిప్పు కలగాలని భరద్వాజ్ ఆకాంక్షించాడు. తెలంగాణ కోసమే తాను చావాలనుకున్నానని, ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి సోమవారం ఢిల్లీ వెళ్తున్నారని మీడియా ద్వారా తెలిసిందని, అదే రోజు ఆథ్మ బలిదానానికి సిద్ధపడితే దాని ప్రభావం అధిష్టానంపై ఉంటుందనే భావనతోనే భరద్వాజ్ ఆత్మహత్యకు పూనుకున్నట్లు తనతో చెప్పారని టిఎంయు నేత బాబు తెలిపారు.
తెలంగాణ కాంగ్రెస్ మంత్రులు రాజీనామా చేయాలని, లేకుంటే ఆ మంత్రులను చెప్పులతో కొట్టాలని, తెలంగాణ కోసం నాదే ఆఖరి చావు కావాలని ఆత్మహత్య చేసుకోవడానికి ముందు భరద్వాజ్ తన సెల్ నుంచి మిత్రులకు, కుటుంబ సభ్యులకు, కొందరు జెఏసి ప్రతినిధులకు ఎస్సెమ్మెస్ పంపించాడు. భరద్వాజ్ ఆత్మహత్యపై ఆగ్రహం చెందిన విట్స్ కళాశాల విద్యార్థులు తరగతులను బహిష్కరించి సోమవారం ఉదయం ఆస్పత్రికి పెద్ద సంఖ్యలో చేరుకున్నారు.
తెలంగాణ మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో అటువైపుగా వచ్చిన రెండు ఆర్టీసీ బస్సులపై విద్యార్థులు రాళ్లు రువ్వగా అద్దాలు ధ్వంసం అయ్యాయి. తర్వాత సమీపంలో ఉన్న మంత్రి బస్వరాజు సారయ్య ఇంటిని ముట్టడించేందుకు ప్రయత్నించారు. దీన్ని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఘర్షణ వాతావరణం నెలకొంది. విద్యార్థులు పోలీసు వాహనంపై, ఎమ్మెల్సీ పుల్లా పద్మావతి భర్త భాస్కర్ వాహనంపై రాళ్లు రువ్వారు. నేడు భరద్వాజ్ అంతిమయాత్ర ఉంటుంది.