దీదీకి కోపమొచ్చింది: కసురుకుని రోడ్డుపై నడిచారు
ఆమె బుక్ ఫెయిర్ నుంచి గేట్ నెంబర్ 3 నుంచి బయటకు రావాల్సింది, ఒకటో గేటు నుంచి వచ్చారు. నిర్ణీత కార్యక్రమం ప్రకారం ఆమె కోసం మూడో గేట్ వద్ద కారు ఎదురు చూస్తూ ఉంది. మమతా బెనర్జీ అనూహ్యంగా తన మార్గాన్ని మార్చుకోవడంతో భద్రతా సిబ్బందికి ఏం చేయాలో పాలుపోలేదు. గుంపు వల్ల, ట్రాఫిక్ జామ్ వల్ల కదలడం కూడా కష్టమైన పరిస్థితి ఏర్పడింది.
మమతా బెనర్డీ సాయంత్రం గం.7.55 ని.లకు ప్రధాన ద్వారమైన మూడో గేట్ నుంచి పుస్తక ప్రదర్శన మైదానంలోకి ప్రవేశించారు. తన పుస్తకాన్ని, కొన్ని సిడిలను విడుదల చేయడానికి జోగో బంగ్లా స్టాల్ వద్దకు వెళ్లారు. ఆమె కోసం తృణమూల్ విద్యార్థి సంఘం నాయకుడు శంకు దేవ్ పోండా, ప్రచురణకర్తలు, బుక్ సెల్లర్స్ గిల్డ్ అధికారులు నిరీక్షిస్తున్నారు. అర గంట పాటు అక్కడ సమయం వెచ్చించిన దీదీ జెబిఎస్ హాల్దేన్ ఎవెన్యూ వైపు ఉన్న ఒకటో నెంబర్ గేటు నుంచి బయటకు వచ్చారు.
వాస్తవానికి మూడో గేట్ వద్ద ఆమె కారు ఉంది. దాన్ని ఒకటో గేట్ వద్దకు తీసుకురావడానికి నానా తిప్పలు పడ్డారు. బయటకు వచ్చిన వెంటనే కారు కనిపించకపోవడంతో భద్రతా సిబ్బందిపై దీదీ మండిపడడారు. రెండు నిమిషాల పాటు ఎదురు చూసి ముందుకు నడవడం ప్రారంభించారు. ఆమె చుట్టూ భద్రతా సిబ్బంది వలయంగా ఏర్పడ్డారు. అయినా ప్రజలు ఆమె వైపు రావడాన్ని వారు నిరోధించలేకపోయారు. దీదీ, దీదీ అంటూ వచ్చి ఆమెతో కరచాలనం చేయడానికి ప్రయత్నించారు
రెండు నిమిషాల పాటు అలా నడిచి, ఆగిపోయి మమతా బెనర్జీ వెనక్కి వచ్చారు. భద్రతా సిబ్బందిపై కసురుకున్నారు. ఆ తర్వాత కొద్దిసేపటికి కారు వచ్చింది.