నిరూపిస్తే కాళ్లు పట్టుకుంటా, లేకపోతే నా కాళ్లు..: షర్మిల
బిడ్డ వయస్సున్న తనపై తెలుగుదేశం నాయకులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఆమె అన్నారు. తన మోకాలి గాయంపై కూడా తెలుగుదేశం రాజకీయం చేస్తోందని ఆమె అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి పాదయాత్ర బూటకమని, ఫ్యాన్లు నెత్తిన పెట్టుకుని చంద్రబాబు పాదయాత్ర చేస్తున్నారని ఆమె వ్యాఖ్యానించారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగానే కాదు, ప్రతిపక్ష నేతగా కూడా పనికి రారని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించకపోవడమే అందుకు నిదర్సనమని ఆమె అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు తొమ్మిదేళ్లు పాలించారని, చంద్రబాబు పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న శాపమని షర్మిల అన్నారు. అధికార కాంగ్రెసు పార్టీతో చంద్రబాబు కుమ్మక్కయ్యారని ఆమె ఆరోపించారు. ప్రభుత్వంపై చంద్రబాబు ఎందుకు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించడం లేదని ఆమె అన్నారు. రాష్ట్రంలోని రైతులకు కనీసం కిరణ్ ప్రభుత్వం భరోసా కల్పించలేకపోతోందని ఆమె అన్నారు. సొంత ఊరిపై ఉన్న ప్రేమ కిరణ్ కుమార్ రెడ్డికి రాష్ట్రంపై లేదని ఆమె అన్నారు.
చంద్రబాబు దర్సకత్వంలో బిజెపి నాటకం ఆడుతోందని, తన భర్త అనిల్ కుమార్పై బిజెపి ఆరోపణలే అందుకు నిదర్సనమని అన్నారు. తాము మతాన్ని వాడుకుంటున్న వస్తున్న ఆరోపణలపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. చేతకాని పిరికి పందలే మతాన్ని వాడుకుంటారని ఆమె అన్నారు. వైయస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఎప్పుడు కూడా మతాన్ని రాజకీయాలకు వాడుకోలేదని ఆమె అన్నారు.
నల్లగొండ జిల్లాకు నీళ్లు అందించే ప్రాజెక్టులను ప్రభుత్వం మూలన పడేసిందని, వైయస్ బతికి ఉంటే ఆ ప్రాజెక్టులు పూర్తయ్యేవని ఆమె అన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి కాగానే ప్రాజెక్టులను పూర్తి చేస్తారని, ఫ్లోరైడ్ పీడిత ప్రాంతాలకు నీళ్లు అందించే ప్రాజెక్టును కూడా పూర్తి చేస్తారని ఆమె చెప్పారు.