తిరుమలకు చేరుకున్న రాజపక్షే: ఉద్రిక్తం, అరెస్టులు
తిరుపతి: శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షే పర్యటన సందర్భంగా తిరుమలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన తమిళ సంఘాలకు చెందిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో శుక్రవారం 144వ సెక్షన్ విధించారు. రాజపక్షే శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు.

రాజపక్సే పర్యటనకు నిరసనగా శుక్రవారం ఉదయం వందలాది మంది తమిళులు ఆందోళనకు దిగారు. తమిళుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న రాజపక్సే తిరుపతి పర్యటనను రద్దు చేసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. రైల్వేస్టేషన్ వద్ద తమిళ ప్రజాసంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకుని, పలువురిని అరెస్ట్ చేశారు. తిరుపతిలో రాజపక్సేకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రాజపక్సే నరరూపరాక్షసుడు అంటూ వ్యాఖ్యలు చేశారు.
శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సె తిరుమల పర్యటనను నిరసిస్తూ చిత్తూరు జిల్లా తిరుపతిలో భారీగా పోస్టర్లు వెలిశాయి. రాజపక్సే శ్రీలంకలోని లక్షా యాభై వేల మంది తమిళులను పొట్టన పెట్టుకున్నారని, ఆ దేశంలోని హిందూ దేవాలయాలను కూల్చి వేయించారని ఆరోపిస్తూ పోస్టర్లు, కరపత్రాలు వెలిశాయి. రాజపక్సేను అడ్డుకుంటామని తమిళ ప్రజా సంఘాలు, పిఎంకే నేత వైగో హెచ్చరించారు. దీంతో తిరుపతి, తిరుమలలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.
పోస్టర్లు, కరపత్రాలకు సంబంధించిన నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమల విష్ణు నివాసం వద్ద దాదాపు 200మందికి పైగా ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజపక్సేకు పర్యటన సాఫీగా సాగేందుకు పోలీసులు కృషి చేస్తున్నారు. మరోవైపు రాజపక్సే తిరుమల పర్యటన సందర్భంగా చెన్నైలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. తిరుపతిలో తమ మూవ్మెంటుకు చెందిన పలువురు కార్యకర్తలను శుక్రవారం సాయంత్రం ఐదు గంటల సమయంలో అరెస్టు చేశారని, దానిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు లిబరేషన్ మూవ్మెంట్ ప్రకటించింది. కాగా తమిళ లిబరేషన్ మూవ్మెంట్ ఆందోళనతో చెన్నైలోని ఓ హోటల్లో శ్రీలంక జెండాను తొలగించారు. రాజపక్సే రాకను నిరసిస్తూ డిఎంకే ఆందోళన చేపట్టింది. చెన్నైలో ఆ పార్టీ చేపట్టిన ర్యాలీలో డిఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, పార్టీ నేత స్టాలిన్ తదితరులు పాల్గొన్నారు.
రాజపక్సే తిరుమల పర్యటన నిరసిస్తూ ఎండిఎంకె నేత వైగో శుక్రవారం న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజపక్సేను ఆహ్వానించి ప్రధానమంత్రి తమిళులకు ద్రోహం చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నో ఆలయాలను ధ్వంసం చేసిన రాజపక్సే తిరుమలకు వస్తే వెంకన్న సన్నిధే అపవిత్రం అవుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రజలు పక్సేను అడ్డుకోవాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆందోళన చేస్తున్న కార్యకర్తలతో పాటు వైగోను పోలీసులు అరెస్ట్ చేశారు.












Click it and Unblock the Notifications