జానాను ఉరికించి కొడతారు: కోమటిరెడ్డి తీవ్ర వ్యాఖ్య
తమ కాంగ్రెసు పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ గులాం నబీ ఆజాద్ వ్యాఖ్యలతో తెలంగాణలో తిరిగి ఆత్మహత్యలు ప్రారంభమయ్యాయని ఆయన అన్నారు. తెలంగాణ నేతలకు పదువులు, డబ్బు తప్ప ప్రజల అభీష్టం పట్టడం లేదని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. జానారెడ్డికి తెలంగాణ బిడ్డల ఉసురు తగులుతుందని ఆయన అన్నారు.
తెలంగాణకు జానారెడ్డి ఆటంకంగా మారారని ఆయన అన్నారు. జానారెడ్డి నిత్యం పోలీసుల పహారాలో ఉండడం కాదని, జనంలోకి వస్తే తెలుస్తుందని ఆయన అన్నారు. తెలంగాణ ప్రజలు ఉరికించుకుంటూ జానారెడ్డిని కొడతారని ఆయన వ్యాఖ్యానించారు. డిసెంబర్ 28వ తేదీన కేంద్ర ప్రభుత్వం అఖిల పక్షం ఏర్పాటు చేసిన తర్వాత ఇప్పటి వరకు ఆరుగురు తెలంగాణ యువకులు ఆత్మహత్య చేసుకున్నారని ఆయన గుర్తు చేశారు. తెలంగాణ యువకుల మరణాలకు తెలంగాణ కాంగ్రెసు నేతలు బాధ్యత వహిస్తారా, కేసులు వేయమంటారా అని ఆయన అడిగారు.
ఇప్పట్లో తెలంగాణ రాదు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదని కాంగ్రెసు గుంటూరు పార్లమెంటు సభ్యుడు రాయపాటి సాంబశివ రావు అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన సమైక్యాంధ్ర సమరభేరి సమావేశంలో ఆయన శనివారం ప్రసంగించారు. తెలంగాణలోకి సీమాంధ్రవారు వెళ్లిన తర్వాతనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందిందని ఆయన అన్నారు.