దొంగ ప్రార్థనలు: షర్మిల భర్త అనిల్పై బాబు వ్యాఖ్య
శనివారం ఉదయం గుంటూరు జిల్లాలోని పెదకాకాని మండలం భరత్సింగ్ సర్కిల్ నుంచి 131వ రోజు 'వస్తున్నా...మీకోసం' పాదయాత్రను చంద్రబాబు ప్రారంభించారు. ఆంజనేయకాలనీలో మిర్చి కల్లాలకు వెళ్లి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన ప్రసంగించారు.
దివంగత నేత వైయస్ రాజశేఖర్రెడ్డి అల్లుడు అనిల్ కుమార్కు భక్తి లేదని, అనిల్వన్నీ దొంగ ప్రార్థనలేనని ఆయన వ్యాఖ్యానించారు.అవినీతి సొమ్ముతో లోటస్పాండ్లో 70 గదుల ఇళ్లు కట్టారని, కుటుంబ సభ్యులు అంతా రెండు గదుల్లో ఉంటే, మిగిలిన రూముల్లో దయ్యాలు తిరుగుతున్నాయని ఆయన అన్నారు.
ముఖ్యమంత్రి కిరణ్కుమార్ రెడ్డి ఉద్యోగాలు అమ్ముకుంటున్నారని, కిరణ్ కుమార్ రెడ్డి తమ్ముళ్లు డబ్బులు వసూలు చేసుకున్నారని చంద్రబాబు విమర్శించారు. వివాదాస్పదమైన 26 జీవోల వ్యవహారంలో మరో 15 మంది మంత్రులు కూడా ఉన్నారని, వారిని ముఖ్యమంత్రి కాపాడుతున్నారని చంద్రబాబు ఆరోపించారు.
ప్రాజెక్టులకు అనుమతులు లేకుండా కాల్వలు తవ్వారని ఆరోపించారు. 23 లక్షల ఎకరాలకు నీరు ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా, 22 వేల ఎకరాలకు కూడా నీరు అందలేదని అన్నారు. తెలుగుదేశం పార్టీ హయాంలో సన్న బియ్యం కిలో రూ.15 ఉంటే, ఇప్పుడు కిలో రూ.50 కి పెరిగిందని చంద్రబాబు అన్నారు. మంత్రి అనుచరులు తప్పుడు పత్రాలతో భూములను కబ్జా చేస్తున్నారని ఆరోపించారు. కబ్జాదారులపై తిరగబడాలని, ప్రజలకు అండగా ఉంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు.
అంతకుముందు చంద్రబాబునాయుడితో గుంటూరు జిల్లా పార్టీ నేతలు సమావేశమయ్యారు. డిసిసిబి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై వారు చర్చిస్తున్నట్లు సమాచారం. కాగా చంద్రబాబునాయుడిని జూనియర్ డాక్టర్లు కలుసుకున్నారు. తమ సమస్యల పరిష్కారానికి అండగా నిలవాలని వారు విజ్ఞప్తి చేశారు.