శ్రీవారి దర్శనం: ప్రజాస్వామ్యమని రాజపక్ష వ్యాఖ్య
శ్రీవారిని దర్శించుకున్న తర్వాత అధికారులు ఆయనకు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఆలయం వెలుపల రాజపక్ష మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. తన భారత పర్యటనపై వ్యక్తమైన ఆందోళనలపై ఆయన స్పందించారు. భారత్ ప్రజాస్వామ్య దేశమని, ఇక్కడ ఎవరైనా నిరసన తెలియజేయవచ్చునని, ఆందోళలను చేయవచ్చునని ఆయన అన్నారు. శ్రీలంక పరిస్థితులను చూస్తే ప్రభుత్వ వైఖరి మీకే అర్థమవుతుందని ఆయన అన్నారు.
శ్రీలంక అధ్యక్షుడు మహిందా రాజపక్షే పర్యటన సందర్భంగా తిరుమలలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకు దిగిన తమిళ సంఘాలకు చెందిన 20 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తిరుమలలో శుక్రవారం 144వ సెక్షన్ విధించారు. రాజపక్షే శుక్రవారం సాయంత్రం ప్రత్యేక విమానంలో రేణిగుంటకు చేరుకున్నారు. ఆ తర్వాత రోడ్డు మార్గంలో తిరుపతి చేరుకున్నారు. తిరుపతిలో హై అలర్ట్ ప్రకటించారు.
రాజపక్సే పర్యటనకు నిరసనగా శుక్రవారం ఉదయం వందలాది మంది తమిళులు ఆందోళనకు దిగారు. తమిళుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్న రాజపక్సే తిరుపతి పర్యటనను రద్దు చేసుకోకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారు హెచ్చరించారు. రైల్వేస్టేషన్ వద్ద తమిళ ప్రజాసంఘాల కార్యకర్తలు ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకుని, పలువురిని అరెస్ట్ చేశారు. తిరుపతిలో రాజపక్సేకు వ్యతిరేకంగా పోస్టర్లు వెలిశాయి. రాజపక్సే నరరూపరాక్షసుడు అంటూ వ్యాఖ్యలు చేశారు.