జగన్, బాబులకు ఎన్నికల భయం!: అందుకే కిరణ్ హ్యాపీ
తమ ప్రభుత్వానికి స్పష్టమైన మెజార్టీ ఉందని కాంగ్రెసు నేతలు బయటకు చెబుతున్నప్పటికీ.. ప్రతిపక్షాలు అవిశ్వాసం పెడితే ఇబ్బందులు తప్పవని లోలోన మదన పడుతున్నారట. అయితే, ముఖ్యమంత్రి మాత్రం ధీమాగా ఉన్నారంటున్నారు. టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు, వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిలు ఎన్నికలకు సిద్ధంగా లేరనే అభిప్రాయంతోనే కిరణ్ బేఫికర్గా ఉన్నారంటున్నారు.
ప్రస్తుతం టిడిపి, వైయస్సార్ కాంగ్రెసు పార్టీల పరిస్థితి బాగా లేదనే చెప్పవచ్చు. ఆ మాటకు వస్తే అధికార కాంగ్రెసు పార్టీ పరిస్థితీ బాగాలేదు. కానీ, బాబు, జగన్లు అవిశ్వాసంపై సవాళ్లు విసురుకుంటున్నప్పటికీ అది జరిగే పని కాదని భావిస్తున్న కిరణ్ నిర్ణీత సమయంలో ఎన్నికలు జరుగుతాయనే ధీమాతో ఉన్నారంటున్నారు. పార్టీ వర్గాలను కూడా ఆయన ఆ దిశలోనే సమాయత్తం చేస్తున్నారట.
చంద్రబాబు వస్తున్నా మీకోసం పాదయాత్ర ప్రారంభించే సమయానికి టిడిపి పరిస్థితి ఏమాత్రం బాగాలేదు. బాబు యాత్రతో ఆ పార్టీ క్రమంగా పుంజుకుంటోంది. ఇప్పుడిప్పుడే పార్టీలో పునరుత్తేజం కనిపిస్తున్న సమయంలో చంద్రబాబు ఎన్నికలకు ఏమాత్రం సిద్ధంగా లేరనే చెప్పవచ్చు. మరోవైపు జగన్ జైలులో ఉన్న కారణంగా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కూడా ఎన్నికలకు సిద్ధంగా లేదు. సెంటిమెంట్ పని చేస్తుందని భావిస్తున్నా.. పూర్తిస్థాయిలో ప్రభావితం చేయగల నాయకుడు జగన్ మాత్రమే. ఆయన లేకుండా ఎన్నికలకు వెళితే బోర్లా పడినా పడవచ్చుననే ఆందోళన ఆ పార్టీలో ఉంది.
అందుకే టిడిపి, వైయస్సార్ కాంగ్రెసులో అవిశ్వాసంపై సవాళ్లు విసురుకుంటున్నాయే తప్ప పెట్టేందుకు మాత్రం ఎవరూ ముందుకు రావడం లేదంటున్నారు. టిడిపికి అవిశ్వాసం పెట్టేందుకు స్పష్టమైన మెజార్టీ ఉంది. ఇక, వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి మెజార్టీ లేకున్నప్పటికీ తనతో కలిసి వచ్చే వారితో పెట్టవచ్చు. టిడిపి మరో సవాల్ కూడా విసిరింది. ఎమ్మెల్యేల లిస్ట్ గవర్నర్కు ఇస్తే తాము ముందుకొస్తామని సవాల్ విసిరింది. కానీ, జగన్ పార్టీ మాత్రం స్పందించలేదు. కేవలం టిడిపి అవిశ్వాసాన్నే అది ప్రశ్నిస్తోంది. రెండు పార్టీల తీరు ఎన్నికలకు ఏమాత్రం సిద్ధంగా లేనట్లుగా స్పష్టంగా కనిపిస్తోందని అందుకే, కిరణ్ ఎలాంటి ఆందోళన చెందకుండా ధీమాగా ఉన్నారని అంటున్నారు.